డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్

- June 25, 2026 , by Maagulf
డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్

హైదరాబాద్: పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల పోలీసుల ప్రవర్తన బాధ్యతాయుతంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గట్టిగా హెచ్చరించారు.కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆసరాగా ఉండాల్సిన సిబ్బంది, కొందరు అమర్యాదగా నడుచుకుంటున్నట్లు ఫిర్యాదులు అందడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో సజ్జనార్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాధితులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించే రిసెప్షనిస్టులు, అడ్మిన్ ఎస్సైలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలను కుటుంబ సభ్యుల్లా భావించి, వారి సమస్యలను ఓపికగా విని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ప్రజలతో కఠినంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

రహస్య డెకాయ్ ఆపరేషన్లతో బయటపడిన నిజాలు

సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి సీపీ సజ్జనార్ వినూత్నంగా డెకాయ్ ఆపరేషన్లను అమలు చేశారు. సాధారణ పౌరుల వేషధారణలో ఉన్న అధికారులను వివిధ పోలీస్ స్టేషన్లకు పంపి, అక్కడ వారికి ఎదురైన పరిస్థితులను ఆయన తెలుసుకున్నారు. దాదాపు 12 స్టేషన్లలో సిబ్బంది ప్రవర్తన చాలా అసభ్యంగా ఉన్నట్లు ఈ తనిఖీల్లో వెల్లడైంది. ఫిర్యాదులను స్వీకరించకుండా సాకులు చెప్పడం, పక్క స్టేషన్‌కు వెళ్లాలని సూచించడం, అడిగిన వారిని సూటిపోటి మాటలతో వేధించడం వంటి ఘటనలు బయటపడ్డాయి. దీనిపై సీరియస్‌గా స్పందించిన సజ్జనార్, ఇప్పటికే బాధ్యులైన కొందరు ఇన్‌స్పెక్టర్లకు ఛార్జిమెమోలు జారీ చేశారు. బాధితులను తిప్పి పంపడం లేదా రోజులు వాయిదా వేయడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజా సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్లు, బదిలీలు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఎంతో ఆశతో పోలీస్ స్టేషన్ గడప తొక్కుతారని, అక్కడ వారికి గౌరవం దక్కకపోతే అది వ్యవస్థకే అవమానమని ఆయన పేర్కొన్నారు. అడ్మిన్ ఎస్సైలు సమయపాలన పాటించాలని, రిసెప్షనిస్టులు ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల పనితీరులో మార్పు రావాలని, బాధితులకు తక్షణ న్యాయం అందడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com