సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

- June 26, 2026 , by Maagulf
సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో భారీ మార్పులు చేస్తూ మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Transfer) చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.రామకృష్ణారావు పదవీ విరమణ చేసిన అనంతరం ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నియామకం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తాజా బదిలీల్లో భాగంగా సెలవుల నుంచి తిరిగొచ్చిన రాహుల్ బొజ్జాను విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు, బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే శైలజా రామయ్యర్‌ను దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అహ్మద్ నదీమ్‌ను రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా, ఎం. రఘునందన్ రావును గనులు & భూగర్భ శాఖ కార్యదర్శిగా నియమించారు. సబ్యసాచి ఘోష్‌కు హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖల పూర్తి అదనపు బాధ్యతలను (FAC) ప్రభుత్వం కట్టబెట్టింది.

కార్పొరేషన్లు, మున్సిపల్ విభాగాల్లోనూ మార్పులు జరిగాయి. బి. అజిత్ రెడ్డి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సీఈవోగా, ముషర్రఫ్ అలీ ఫారూకీ టీజీఆర్‌ఈడీసీవో వీసీ & ఎండీగా నియమితులయ్యారు. పీ. కాత్యాయనీ దేవి, కే. గంగాధర్ కూడా కీలక శాఖల్లో బాధ్యతలు చేపట్టారు. నగరాల విషయానికి వస్తే, హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ (GWMC)గా బదిలీ చేయగా, ఆయన స్థానంలో కే. చంద్రకళకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్‌గా కె. విద్యాసాగర్ నియమితులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com