కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- June 27, 2026
దుబాయ్: ఎండ తీవ్రత నుంచి కార్మికులను రక్షించడంతో పాటు వారికి భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో దుబాయ్ పోలీసులు ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమాన్ని వరుసగా రెండో వారంలోనూ నిర్వహించారు. దుబాయ్ పోలీసుల పాజిటివ్ స్పిరిట్ కౌన్సిల్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్, ‘థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్’ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా చైనా రైల్వే–మరైస్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో 700 మందికిపైగా కార్మికులు పాల్గొన్నారు. వారికి చల్లని తాగునీరు, గొడుగులు, భోజనాన్ని అందించడంతో పాటు, వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా హీట్ స్ట్రెస్ నుంచి ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కార్మికులకు హీట్ స్ట్రెస్ ప్రమాదాలు మరియు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అధికారులు వివరించారు.ఈ చర్యలు యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ‘మిడ్డే వర్క్ బ్యాన్’ విధానానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 3:00 గంటల వరకు నేరుగా ఎండలో బహిరంగ పనులు చేయడం నిషేధించబడుతుంది. దీని ప్రధాన ఉద్దేశం కార్మికులను తీవ్రమైన ఎండ ప్రభావం నుంచి కాపాడటమే.
పాజిటివ్ స్పిరిట్ కౌన్సిల్ చైర్పర్సన్ ఫాతిమా అహ్మద్ బుహజీర్ మాట్లాడుతూ, ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం యూఏఈ మానవతా విలువలకు ప్రతీక అని చెప్పారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికి కృతజ్ఞత తెలియజేయడమే కాకుండా, వారి పని ప్రదేశాలకే వెళ్లి సహాయం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
కార్మికుల ఆరోగ్యం, భద్రతను కాపాడటం తమ బాధ్యతలో కీలక భాగమని, సురక్షితమైన, స్థిరమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని బుహజీర్ తెలిపారు.
కార్యక్రమం ముగింపులో కార్మికులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మానవతా కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి యూఏఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







