ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..

- June 29, 2026 , by Maagulf
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..

న్యూ ఢిల్లీ: ఇరాన్‌ దివంగత మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకావడం లేదు. ఆయన స్థానంలో భారతదేశ అధికారిక ప్రతినిధులుగా బీహార్‌ గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సయ్యద్‌ అతా హస్నైన్‌, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాల్సిందిగా ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం పంపారు. అయితే, అదే సమయంలో ప్రధాని మోదీ ఇండోనేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల పర్యటనలు ఇప్పటికే ఖరారు కావడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. మోదీ విదేశీ పర్యటనల షెడ్యూల్‌ ముందుగానే ఖరారైందని భారత అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన అంత్యక్రియలు
గత ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. తొలుత మార్చి నెలలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని భావించినప్పటికీ, ఆ సమయంలో నెలకొన్న తీవ్ర ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా వాటిని వాయిదా వేశారు. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో, ఈ జులైలో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో అధికారికంగా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

జులై 4న ప్రజా సందర్శనం..జులై 9న తుది అంత్యక్రియలు
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం..జులై 4న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ప్రముఖ గ్రాండ్‌ మొసల్లా సముదాయంలో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత, జులై 9న ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లోని పవిత్ర ఇమామ్‌ రెజా దర్గా వద్ద ఆయన చివరి అంత్యక్రియల ప్రక్రియ జరగనుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com