హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ

- August 15, 2026 , by Maagulf
హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ

అబుదాబి: హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ADNOCకు అనుబంధమైన వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇరాన్ దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) వెల్లడించింది.

ఈ దాడి అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని యూఏఈ పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం లేదా అంతర్జాతీయ సముద్ర మార్గాలకు అడ్డంకులు సృష్టించడాన్ని తీర్మానం తిరస్కరిస్తుందని తెలిపింది.

వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, హోర్ముజ్ జలసంధిని ఆర్థిక ఒత్తిడి లేదా బెదిరింపులకు సాధనంగా ఉపయోగించడం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చేపడుతున్న సముద్ర దోపిడీ చర్యలకు సమానమని యూఏఈ విదేశాంగ శాఖ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఇలాంటి చర్యలు ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రజల భద్రతకు మాత్రమే కాకుండా ప్రపంచ ఇంధన భద్రతకు కూడా ప్రత్యక్ష ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇరాన్ తక్షణమే ఎటువంటి ప్రేరేపణ లేకుండా కొనసాగిస్తున్న దాడులను నిలిపివేయాలని యూఏఈ కోరింది. అన్ని రకాల శత్రుత్వ చర్యలకు తక్షణమే, పూర్తిగా కట్టుబడి కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేసింది.

అదేవిధంగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా, ఎలాంటి షరతులు లేకుండా తిరిగి తెరవాలని యూఏఈ స్పష్టం చేసింది. ఈ కీలక సముద్ర మార్గం ద్వారా అంతర్జాతీయ నౌకాయానం సురక్షితంగా కొనసాగడం ప్రాంతీయ భద్రతతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్య స్థిరత్వానికి అత్యంత కీలకమని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com