పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

- July 03, 2026 , by Maagulf
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

న్యూ ఢిల్లీ: దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించే సూచనలు కనిపిస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడిచమురు) ధరలు ప్రస్తుత స్థాయిలోనే స్థిరంగా కొనసాగితే, రాబోయే రెండు మూడు నెలల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం వెల్లడించారు.

చమురు సంస్థల నష్టాలు..ధరల స్థిరత్వం
పశ్చిమాసియా (Middle East) దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గతంలో ముడిచమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు కొనుగోలు చేసిన నిల్వలనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం వాడుతున్నాయని మంత్రి వివరించారు. ఈ అధిక ధరల భారం వల్ల జూన్ 30 నాటికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై దాదాపు రూ. 74,781 కోట్ల మేర నష్టాలను భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అందువల్ల ధరల తగ్గింపుపై ఇప్పుడే ఖచ్చితమైన ప్రకటన చేయడం తొందరపాటే అవుతుందని, అదంతా అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.


దిగొచ్చిన ప్రైవేట్ చమురు ధరలు..ఎల్పీజీ ఊరట
ఇదిలావుండగా, ప్రైవేట్ రంగ ఇంధన సరఫరా సంస్థ ‘నయారా ఎనర్జీ’ ఇప్పటికే ధరల తగ్గింపును అమలు చేసింది. జూలై 1 నుంచి తన అవుట్‌లెట్లలో లీటరు పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 చొప్పున తగ్గించినట్లు ప్రకటించింది. గత రెండేళ్ల కాలంలో చమురు ధరలు తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీనితో పాటు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ (Commercial LPG) సిలిండర్ల ధరలను సైతం రూ. 183.50 మేర తగ్గించారు. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తక్కువ పెంపు

గడిచిన నాలుగేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఉన్నప్పటికీ భారత్‌లో పెట్రోల్ ధరలు 5.58 శాతం, డీజిల్ ధరలు 6.23 శాతం మాత్రమే పెరిగాయని మంత్రి గుర్తు చేశారు. అదే సమయంలో కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 20 శాతం, మన పొరుగు దేశాల్లో 35 శాతం వరకు ధరలు పెరిగాయని వివరించారు. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సామాన్యులపై భారం పడకుండా చూసిందని తెలిపారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12, డీజిల్ ధర రూ. 95.20 వద్ద కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com