కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు

- July 04, 2026 , by Maagulf
కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనలో భాగంగా ఒక సంచలన ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ తరహాలోనే.. త్వరలోనే కుప్పంలోనూ బంగారు ఉత్పత్తి (మైనింగ్) ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. కుప్పం ప్రాంతాన్ని కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతంగానే కాకుండా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి రాబోయే పెట్టుబడుల వివరాలను వెల్లడిస్తూ.. దాదాపు రూ. 9,322 కోట్ల భారీ పెట్టుబడులతో 30 నూతన పరిశ్రమలు కుప్పం ప్రాంతానికి రానున్నాయని, వీటి స్థాపన ద్వారా స్థానిక యువతకు సుమారు 87 వేల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

కుప్పానికి విమానాశ్రయం..రాయలసీమ ప్రగతిపై సీఎం ప్రత్యేక నజర్

కుప్పం నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే అతి త్వరలోనే కుప్పానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయం (Airport) కూడా రాబోతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని సీఎం చంద్రబాబు ఈ వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com