భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ

- July 04, 2026 , by Maagulf
భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధం వల్ల తలెత్తిన 21వ శతాబ్దపు అత్యంత భయంకరమైన ఇంధన సంక్షోభాన్ని భారతదేశం ఎంతో సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సరైన సమయంలో ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, పటిష్టమైన దౌత్య నీతి వల్లే దేశానికి ఇంధన కొరత రాకుండా కాపాడుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. శనివారం రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ప్రతిష్టాత్మక ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

సముద్ర మార్గాల్లో అడ్డంకులున్నా చమురు సరఫరా అగలేదు
“నవ భారత దృఢ సంకల్పం మరియు సరైన ప్రణాళికతో మనం శతాబ్దపు అతిపెద్ద ఇంధన గండాన్ని గట్టెక్కాం” అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా హర్ముజ్ జలసంధి వంటి అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో చమురు సరఫరా నిలిచిపోయిన ఉదంతాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ క్లిష్ట సమయంలో భారత్ ముందస్తుగా స్పందించి, దేశీయ వనరులను సమర్థవంతంగా వాడుకోవడంతో పాటు గ్లోబల్ దౌత్యం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు దిగుమతులు నిరంతరాయంగా సాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

చమురు సంస్థలపై రూ. 75,000 కోట్ల భారం.. 40 దేశాలకు పెరిగిన నెట్‌వర్క్
తీవ్ర ఇంధన సంక్షోభం ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న తరుణంలో, మన దేశంలోని సామాన్య వినియోగదారులపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMCs) సుమారు రూ. 75,000 కోట్లకు పైగా నష్టాలను స్వయంగా భరించాయని, వీరికి ప్రభుత్వం అండగా నిలిచిందని ప్రధాని వివరించారు. మన దౌత్య వ్యూహాల వల్ల గతంలో చమురు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 25గా ఉంటే, దానిని రికార్డు స్థాయిలో 40 దేశాలకు విస్తరించుకున్నామని చెప్పారు. సంక్షోభ సమయంలో కొందరు విపక్ష నాయకులు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడినప్పటికీ, ప్రభుత్వం నిశ్శబ్దంగా చేసిన ఈ కృషి ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయం సమృద్ధి) స్ఫూర్తిని చాటిచెప్పిందని కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com