జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..

- July 05, 2026 , by Maagulf
జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ జూలై 5 నుంచి 15 వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, అమెరికా, బెల్జియంలలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.

జూలై 5 నుంచి 10 వరకు జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాల విదేశాంగ మంత్రులు, ఉన్నత నాయకత్వంతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ప్రాంతీయ భద్రతతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

గల్ఫ్ పర్యటన అనంతరం జైశంకర్ అమెరికాలోని న్యూయార్క్ వెళ్లనున్నారు. అక్కడ జూలై 13న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో 2028–29 కాలానికి భారత్ శాశ్వతేతర సభ్యత్వ అభ్యర్థిత్వ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత జూలై 14, 15 తేదీల్లో బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరంలో జరిగే మూడో భారత్–యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్, బెల్జియం ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి వాణిజ్యం, సాంకేతిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈ పర్యటనల ద్వారా గల్ఫ్ దేశాలు, యూరోపియన్ యూనియన్‌తో భారత సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకునే అవకాశం లభిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com