బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ

- July 07, 2026 , by Maagulf
బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ

హైదరాబాద్: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. తమ ఆసుపత్రి రజతోత్సవాలు (సిల్వర్ జూబ్లీ) జరుపుకుంటున్న ఈ ప్రత్యేక సంవత్సరంలో సంజయ్ దత్ ఇక్కడికి పర్యటించడం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు. ఈ మేరకు బాలకృష్ణ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు.

రోగులతో ఆత్మీయ సంభాషణ.. ధైర్యం నింపిన సంజయ్ దత్
నిన్న ఆసుపత్రి సందర్శనకు విచ్చేసిన సంజయ్ దత్‌కు నందమూరి బాలకృష్ణ సాదర స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా సంజయ్ దత్ ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు. క్యాన్సర్‌పై పోరాడుతున్న వారిలో కొండంత ధైర్యం నింపే ప్రయత్నం చేయడంతో పాటు, ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బందితో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. సంజయ్ దత్ రాక తమ సిబ్బందికి, రోగులకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిందని బాలకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు.

సంజయ్ దత్ పర్యటన, ఆయన మాకు అందించిన ప్రోత్సాహం మా బసవతారకం ఆసుపత్రి యాజమాన్యానికి మరింత బలాన్ని ఇచ్చాయి. రోగులకు కారుణ్యంతో కూడిన, శ్రేష్ఠమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందించాలన్న మా ఆశయాన్ని ఈ పర్యటన మరింత పటిష్ఠం చేస్తుంది. ఆశ, స్వస్థత, శ్రేష్ఠతతో కూడిన మా సేవా ప్రయాణాన్ని భవిష్యత్తులోనూ ఇలాగే విజయవంతంగా కొనసాగిస్తాం అని బాలకృష్ణ వివరించారు. బాలీవుడ్ స్టార్ నటుడు, టాలీవుడ్ స్టార్ నటుడు ఒకే వేదికపై కనిపించడంతో ఇరు వర్గాల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com