ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!

- July 07, 2026 , by Maagulf
ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!

రియాద్: విదేశీ పర్యాటకులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా సౌదీ అరేబియా మరో కీలక అడుగు వేసింది. ఎంపిక చేసిన దేశాల్లో గుర్తింపు పొందిన ట్రావెల్, టూరిజం సంస్థల ద్వారా ‘ప్యాకేజ్ వీసా’ (Package Visa) పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అర్హులైన విదేశీ సందర్శకులు ఒకే ట్రావెల్ ప్యాకేజీలో టూరిస్ట్ వీసాతో పాటు విమాన టికెట్లు, హోటల్ బుకింగ్‌లను పొందే అవకాశం కల్పించింది.

ప్యాకేజ్ వీసా కార్యక్రమాన్ని సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ, అంతర్గత వ్యవహారాల శాఖ, ఇన్సూరెన్స్ అథారిటీ సంయుక్తంగా రూపొందించాయి. ఇప్పటికే అమల్లో ఉన్న ఈ-వీసా, వీసా ఆన్ అరైవల్, స్టాప్‌ఓవర్ ట్రాన్సిట్ వీసా సేవలకు కొనసాగింపుగా ఈ కొత్త ప్యాకేజ్ వీసా పనిచేయనుంది. ఈ విధానంలో అర్హత పొందిన ట్రావెల్ సంస్థల ద్వారా ప్రయాణికులు రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు, లైసెన్స్ పొందిన హోటళ్లలో బుకింగ్, ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా దరఖాస్తును ఒకే ప్యాకేజీగా బుక్ చేసుకోవచ్చని సౌదీ పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు.  పర్యాటకులకు మరింత సులభమైన, వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. భవిష్యత్‌లో పర్యాటక రంగంలో చేపట్టబోయే సంస్కరణలకు ఈ పైలట్ కార్యక్రమం నాంది పలుకుతుందని పేర్కొన్నారు.

అయితే, ఈ ప్యాకేజ్ వీసా కార్యక్రమంలో పాల్గొనే ట్రావెల్ సంస్థలకు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్, 24 గంటల టెక్నికల్ సపొర్ట్, కస్టమర్ సర్వీస్ సెంటర్ వంటి ప్రమాణాలను తప్పనిసరి చేశారు. ఇదిలా ఉండగా, 2025లో సౌదీ అరేబియా పర్యాటక రంగంలో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మొత్తం 123 మినియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. వీరి పర్యాటక వ్యయం 304 బిలియన్ సౌదీ రియాల్స్ కు చేరింది. పర్యాటక రంగంలో దాదాపు 1.03 మిలియన్ల ఉద్యోగాలను కల్పించినట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com