ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!

- July 09, 2026 , by Maagulf
ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!

మస్కట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ జూలై 9–10తేదీల్లో ఒమాన్ సుల్తానేట్‌లో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఇప్పటికే ఖతార్, బహ్రెయిన్, కువైట్ దేశాల్లో పర్యటించిన ఆయన, తదుపరి ఒమన్‌లో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ పర్యటన సందర్భంగా ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసైదీతో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్–ఒమాన్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రతతో పాటు ఇతర కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించనున్నారు.

అలాగే 2025 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఒమాన్ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత్–ఒమాన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై కూడా ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది.ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై పరస్పర ఆసక్తి కలిగిన అంశాలపై కూడా ఇరు విదేశాంగ మంత్రులు అభిప్రాయాలు పంచుకోనున్నారు.

ఒమాన్ పర్యటన అనంతరం జైశంకర్ అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లి జూలై 13న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) 2028–29 కాలానికి భారత్ అభ్యర్థిత్వ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం జూలై 14–15 తేదీల్లో బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో జరిగే భారత్–యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (TTC) మూడో సమావేశంలో పాల్గొని యూరోపియన్ యూనియన్, బెల్జియం విదేశాంగ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

ఈ పర్యటనతో భారత్–ఒమాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంతో పాటు రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, బహుముఖ సహకారం మరింత విస్తరించనున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com