వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!

- July 09, 2026 , by Maagulf
వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!

అబుదాబి: వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా మాజీ సహోద్యోగినిని దూషించిన కేసులో ఓ మహిళకు అబుదాబి క్రిమినల్ కోర్టు 30 వేల దిర్హమ్‌లు (Dh30,000) జరిమానా విధించింది. అంతేకాకుండా బాధితురాలికి తాత్కాలిక పరిహారంగా21 వేల దిర్హమ్‌లు (Dh21,000) చెల్లించాలని కూడా ఆదేశించింది. కోర్టు తీర్పు ప్రకారం, బాధితురాలు పలుమార్లు వచ్చిన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన నిందితురాలు వాట్సాప్‌లో అసభ్య పదజాలంతో కూడిన వాయిస్ మెసేజ్ పంపింది. కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఆ ఆడియోనే కేసులో కీలక సాక్ష్యంగా పరిగణించారు.

విచారణ సందర్భంగా నిందితురాలు తాను ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని, ఫోన్ ఎత్తకపోవడంతో కోపంలో ఆ వాయిస్ మెసేజ్ పంపానని, తమ మధ్య చాలా కాలంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది.అయితే వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయనే కారణంతో చట్టం మినహాయింపు ఇవ్వదని కోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ మాధ్యమాల ద్వారా నమోదైన స్పష్టమైన దూషణలు యూఏఈ సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం నేరంగానే పరిగణిస్తామని పేర్కొంది.

ఈ తీర్పు ద్వారా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో క్షణిక ఆవేశంతో పంపే సందేశాలు కూడా తీవ్రమైన చట్టపరమైన, ఆర్థిక పరిణామాలకు దారితీస్తాయని కోర్టు హెచ్చరించింది. డిజిటల్ కమ్యూనికేషన్‌లో మర్యాద పాటించాలని, ఆన్‌లైన్‌లో పంపిన సందేశాలు సైబర్ నేరాల విచారణలో కీలక సాక్ష్యాలుగా మారవచ్చని యూఏఈ అధికారులు మరోసారి ప్రజలకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com