యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!

- July 09, 2026 , by Maagulf
యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!

దుబాయ్: యూఏఈ నుంచి భారత్‌కు వెళ్లే ఎన్నారైలు (NRIs), భారతీయ ప్రవాసుల కోసం కేంద్ర ప్రభుత్వం 2026 బ్యాగేజ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై డ్యూటీ-ఫ్రీ పరిమితులను సవరించడంతో, ఇకపై విలువ ఆధారంగా కాకుండా బరువు ఆధారంగా మినహాయింపు వర్తించనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. విదేశాల్లో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నివసించిన భారతీయులు, ఎన్నారైలు మరియు అర్హత కలిగిన భారతీయ మూలాలున్న ప్రయాణికులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.

డ్యూటీ లేకుండా ఎంత బంగారం తీసుకెళ్లవచ్చు?

మహిళలు: గరిష్టంగా 40 గ్రాముల బంగారు ఆభరణాలు

పురుషులు: గరిష్టంగా 20 గ్రాముల బంగారు ఆభరణాలు

గతంలో బంగారం బరువుతో పాటు దాని విలువకు కూడా పరిమితి ఉండేది. మహిళలకు రూ.1 లక్ష, పురుషులకు రూ.50 వేల వరకు మాత్రమే విలువ ఉన్న ఆభరణాలకు మినహాయింపు ఉండేది. అయితే 2026 నిబంధనల్లో ఆ విలువ పరిమితిని పూర్తిగా తొలగించి, కేవలం బరువు పరిమితిని మాత్రమే కొనసాగిస్తున్నారు.

గోల్డ్ బార్లు, నాణేలకు మినహాయింపు ఉందా?

ఈ డ్యూటీ-ఫ్రీ సౌకర్యం కేవలం వ్యక్తిగతంగా ధరించే లేదా వెంట తీసుకెళ్లే బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. గోల్డ్ బార్లు, బంగారు నాణేలు, బిస్కెట్లు లేదా బులియన్‌కు ఈ మినహాయింపు వర్తించదు. వాటిపై కస్టమ్స్ సుంకాలు, డిక్లరేషన్ నిబంధనలు అమల్లో ఉంటాయి.

పరిమితికి మించి బంగారం ఉంటే?

నిర్దేశిత పరిమితికి మించి బంగారు ఆభరణాలు తీసుకెళ్లడం నిషేధం కాదు. అయితే అదనపు బంగారాన్ని తప్పనిసరిగా కస్టమ్స్ అధికారులకు ప్రకటించి, వర్తించే సుంకాన్ని చెల్లించాలి. ప్రకటించకుండా తీసుకెళ్తే జరిమానాలు, బంగారం స్వాధీనం లేదా ఇతర చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

జ్వువెల్లరీని చెక్డ్ బ్యాగేజీలో పెట్టవచ్చా?

భద్రతా కారణాల దృష్ట్యా, విలువైన నగలను చెక్డ్ లగేజీలో కాకుండా, క్యాబిన్ బ్యాగేజీలో లేదా తమ వద్దే ఉంచుకోవాలని ప్రయాణికులకు సూచించారు. మీరు తీసుకువెళ్తున్న వస్తువుల గురించి కస్టమ్స్ అధికారులు వివరణ కోరినప్పుడు, కొనుగోలు ఇన్వాయిస్‌లు లేదా రసీదులను మీ వద్ద ఉంచుకోవడం కూడా సహాయపడుతుంది.

యూఏఈ నివాసితులకు ఈ మార్పు ముఖ్యమైనదా?

యూఏఈ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఆభరణాల మార్కెట్లలో ఒకటి. తక్కువ పన్నులు మరియు పోటీతో కూడిన రిటైల్ మార్కెట్ కారణంగా, ఇక్కడి ధరలు భారతదేశం కంటే తరచుగా దాదాపు 13 శాతం తక్కువగా ఉంటాయి. విలువ పరిమితిని తొలగించడం వల్ల, బంగారం ధరలలోని హెచ్చుతగ్గులు డ్యూటీ-ఫ్రీ రాయితీని ప్రభావితం చేస్తాయేమోనని ప్రయాణికులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కొత్త నిబంధనలు యూఏఈలో నివసిందే భారతీయ ప్రవాసులకు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి.

ఇతర కీలక మార్పులు

2026 బ్యాగేజ్ నిబంధనల్లో సాధారణ డ్యూటీ-ఫ్రీ పరిమితిని పెంచడం, ఎలక్ట్రానిక్ బ్యాగేజ్ డిక్లరేషన్‌ను సులభతరం చేయడం, 18 ఏళ్లు పైబడిన అర్హులైన ప్రయాణికులకు ఒక ల్యాప్‌టాప్‌ను డ్యూటీ-ఫ్రీగా తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వడం, భారత్‌కు శాశ్వతంగా తిరిగి వస్తున్న వారికి 'ట్రాన్స్‌ఫర్ ఆఫ్ రెసిడెన్స్' నిబంధనలను సులభతరం చేయడం వంటి మార్పులు కూడా చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com