చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..

- July 10, 2026 , by Maagulf
చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆదరణ పొందిన లీగ్‌లలో ఒకటైన ఆస్ట్రేలియా ‘బిగ్ బాష్ లీగ్’ (BBL) సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. లీగ్ చరిత్రలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా వెలుపల ఒక అధికారిక మ్యాచ్‌ను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. బిగ్ బాష్ లీగ్ (2026-27) సీజన్ తాలూకు ప్రతిష్టాత్మక ప్రారంభ మ్యాచ్‌కు భారతదేశంలోని క్రికెట్ హబ్ ‘చెన్నై’ నగరం వేదిక కానుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ శుక్రవారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) సాక్షిగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కెట్ ఆస్ట్రేలియా (CA) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ చారిత్రాత్మక మ్యాచ్ డిసెంబర్ 12న చెన్నైలోని ప్రసిద్ధ ఎం.ఏ. చిదంబరం (Chepauk) స్టేడియంలో జరగనుంది. బిగ్ బాష్ లీగ్ సరికొత్త సీజన్ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ల శ్రేణికి చెందిన మెల్బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్లు తలపడనున్నాయి. ఇందులో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు ‘హోమ్ టీమ్’గా వ్యవహరించడం విశేషం. ఇండియాకు ఐపీఎల్ (IPL) నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ, ఒక విదేశీ దేశీయ లీగ్‌కు సంబంధించిన అధికారిక మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ విజయవంతం కావడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా తన పూర్తి మద్దతును ప్రకటించింది.

ఆనందం, స్నేహబంధం మాత్రమే ఉంటుంది: ప్రధాని మోదీ

మెల్‌బోర్న్ (MCG) మైదానాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు ఈ గ్రౌండ్‌తో ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న క్రీడా, దౌత్య సంబంధాలలో ఇదొక కీలక మైలురాయి అని అభివర్ణించారు. “చెన్నైలో జరగబోయే ఈ ప్రత్యేకమైన మ్యాచ్ సమయంలో ‘లాస్ట్ ఓవర్ ఫినిష్’ ఒత్తిడి ఉండదు. కేవలం ఆటలోని ఆనందం, భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధం మాత్రమే మైదానంలో కనిపిస్తాయి” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

క్రికెట్‌తో పాటు సాంస్కృతిక ఉత్సవాలు

బిగ్ బాష్ లీగ్‌ను భారతీయ క్రీడాభిమానులకు మరింత దగ్గర చేయడమే కాకుండా, రెండు దేశాల మధ్య పర్యాటక, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ మ్యాచ్ ఎంతో దోహదపడుతుందని బీబీఎల్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డోబ్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం, ‘సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా-ఇండియా రిలేషన్స్’ సంయుక్త ఆధ్వర్యంలో మ్యాచ్ జరిగే సమయంలో చెన్నైలో భారీ సాంస్కృతిక, చలనచిత్ర ఉత్సవాలను కూడా నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com