అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

- July 30, 2026 , by Maagulf
అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: హైదరాబాద్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ క్రీడల్లో దేశవ్యాప్తంగా 36 రాష్ట్ర పోలీసు జట్లుతో పాటు సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల జట్లు పాల్గొన్నాయి. జూడో, కరాటే, తైక్వాండో, వుషు, పెన్‌కాక్ సిలాట్ అనే ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించగా, దేశం నలుమూలల నుంచి సుమారు 1,600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, పోటీల నిర్వహణలో తెలంగాణ పోలీసులు వసతి, రవాణా, భద్రత వంటి అన్ని ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారని తెలిపారు. పోలీసింగ్‌లో క్రీడలు అంతర్భాగమని, శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

అఖిల భారత పోలీసు క్రీడలు వివిధ రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య సమన్వయం, సహకారాన్ని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు మంచి వేదికగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

తన క్రీడా అనుభవాలను గుర్తు చేసుకుంటూ, 2004లో అఖిల భారత పోలీసు టెన్నిస్ పోటీల్లో తాను పాల్గొన్నానని, తమ జట్టు జట్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుందని తెలిపారు. వ్యక్తిగత విభాగంలో సెమీఫైనల్ వరకు చేరినట్లు చెప్పారు. అలాగే అఖిల భారత పోలీసు క్రికెట్, గోల్ఫ్ పోటీల్లో కూడా పాల్గొంటూ ఉంటానని, ఆ పోటీలు ఎంతో పోటీతత్వంతో సాగుతాయని అన్నారు.

అంతర్జాతీయ క్రీడల్లో భారత్ మరింత ఎక్కువ పతకాలు సాధించాలంటే దేశంలోని క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ, ప్రతిభకు ప్రోత్సాహం పెరిగితే భారత క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో మరింత విజయాలు సాధించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com