17 రోజుల్లో 839 మంది అరెస్ట్.. 280 మిలియన్ డాలర్ల ఆస్తుల సీజ్..!!

- August 04, 2026 , by Maagulf
17 రోజుల్లో 839 మంది అరెస్ట్.. 280 మిలియన్ డాలర్ల ఆస్తుల సీజ్..!!

అబుదాబి: పర్యావరణ నేరాలపై యూఏఈ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ షీల్డ్–2026 ఘన విజయాన్ని సాధించింది. కేవలం 17 రోజుల వ్యవధిలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఆపరేషన్‌లో 839 మందిని అరెస్ట్ చేయగా, 280 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా విలువైన ఆస్తులు, పరికరాలు, ఇతర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


యూఏఈ ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ వివరాలను 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. మొత్తం 1,045 ఫీల్డ్ ఆపరేషన్లు నిర్వహించి పర్యావరణ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెరుగుతున్న పర్యావరణ నేరాలను అరికట్టేందుకు యూఏఈ ఆధ్వర్యంలో జూలైలో కొలంబియా, ఈక్వడార్, పెరూ, బొలీవియా, బ్రెజిల్ దేశాల సహకారంతో ఈ ఆపరేషన్ ప్రారంభించారు. 

ప్రపంచంలో అత్యంత కీలకమైన జీవవైవిధ్య ప్రాంతమైన అమెజాన్ బేసిన్ పరిధిలో ఈ భారీ బహుళ దేశాల సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా యూఏఈ 2023లో ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ కార్యాలయం (UNODC)తో కలిసి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ క్లైమేట్ (I2LEC) కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఆపరేషన్ గ్రీన్ షీల్డ్–2026 విజయం ద్వారా వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాలను కార్యాచరణలోకి తీసుకువచ్చి స్పష్టమైన ఫలితాలు సాధించే సామర్థ్యం యూఏఈకి ఉందని షేక్ సైఫ్ పేర్కొన్నారు. అలాగే సరిహద్దులు దాటి జరిగే పర్యావరణ నేరాలను అరికట్టేందుకు, సహజ పర్యావరణ వ్యవస్థలను భావితరాలకు పరిరక్షించేందుకు ఈ ఆపరేషన్ ఆదర్శవంతమైన నమూనాగా నిలిచిందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com