యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్

- August 04, 2026 , by Maagulf
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: మణ్చిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS) రెండో విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ప్రారంభ సంవత్సరంలో 125 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల ప్రస్తుతం ఆరో తరగతి వరకు 345 మంది విద్యార్థులతో అభివృద్ధి చెందడం సంతోషకరమని పేర్కొన్నారు.

దాదాపు 10 నెలల విరామం అనంతరం పునర్వ్యవస్థీకరించిన సొసైటీ కమిటీ, ఉప కమిటీల పూర్తి స్థాయి సమావేశానికి డీజీపీ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో కొత్త క్యాంపస్‌కు మార్పు, నిర్మాణ పనుల పురోగతి, విద్యా ప్రణాళిక, పెండింగ్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన డీజీపీ, పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, క్రమశిక్షణ, విలువలతో కూడిన సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించే జాతీయ స్థాయి ఆదర్శ విద్యాసంస్థగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పాఠశాల అభివృద్ధికి ఐపీఎస్ ఓవా (IPS OWA) చురుకుగా సహకరించాలని నిర్ణయించడం సంతోషకరమని తెలిపారు. ఈ సందర్భంగా ఐపీఎస్ ఓవా అధ్యక్షురాలు లలిత ఆనంద్ కూడా డీజీపీతో కలిసి పాఠశాలను సందర్శించారు.

యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన డీజీపీ, విద్యార్థుల్లో అత్యున్నత స్థాయి క్రమశిక్షణను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ పోలీసు అధికారులు తరచూ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

పాఠశాల సందర్శన సందర్భంగా డీజీపీ విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అలాగే ఆర్చరీ, ఫెన్సింగ్ తదితర క్రీడల్లో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను వీక్షించి వారిని అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com