లండన్‌లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్

- August 07, 2026 , by Maagulf
లండన్‌లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్

లండన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ లండన్ పర్యటనలో చిన్నారులతో కలిసి దిగిన ఆప్యాయ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

బ్రిటన్ రాజధాని లండన్‌లో పర్యటిస్తున్న షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఇటీవల ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ కనిపించారు. నగరంలో సాధారణ ప్రజలతో కలిసి ఫొటోలు దిగుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన సందడి చేశారు.

ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ కూడా లండన్‌లో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్‌ను కలుసుకున్నారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పలకరించుకున్నారు. హోటల్ లాబీలో కలిసి నడుచుకుంటూ వస్తున్న సమయంలో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇద్దరు నాయకులు చిన్నారులతో కలిసి చిరునవ్వులతో ఫొటోలు దిగడం, వారితో ఆప్యాయంగా ముచ్చటించడం నెటిజన్లను ఆకట్టుకుంది. హోటళ్ల వద్ద, వీధుల్లో యూఏఈ నాయకులను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వేచి ఉండగా, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పలువురిని పలకరిస్తూ చేతులు ఊపి అభివాదం చేశారు. కొందరితో ఆలింగనం చేసుకుని ఆత్మీయతను చాటుకున్నారు.

అధికారిక కార్యక్రమాలకు అతీతంగా నాయకుల సహజ స్వభావాన్ని ప్రతిబింబించిన ఈ క్షణాలు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి. చిన్నారులతో వారి స్నేహపూర్వక వ్యవహారం, ప్రజలతో కలిసిమెలిసి ఉండే తీరు యూఏఈ నాయకత్వంలోని ఐక్యత, పరస్పర గౌరవం, మానవీయ విలువలను మరోసారి చాటిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

యూఏఈలోనూ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తరచుగా ప్రజల మధ్యకు వచ్చి వారితో ఫొటోలు దిగడం, ఆప్యాయంగా మాట్లాడడం ద్వారా అత్యంత చేరువైన నాయకులుగా గుర్తింపు పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com