‘ఇన్‌స్టా పేరెంటింగ్’తో పిల్లలకు ముప్పు.. యూఏఈ వైద్యుల హెచ్చరిక..!!

- August 11, 2026 , by Maagulf
‘ఇన్‌స్టా పేరెంటింగ్’తో పిల్లలకు ముప్పు.. యూఏఈ వైద్యుల హెచ్చరిక..!!

షార్జా: పిల్లల చిన్ననాటి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టు చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని యూఏఈకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులకు ఇవి మధుర జ్ఞాపకాలుగా కనిపించినప్పటికీ.. పిల్లలు పెద్దయ్యాక అదే కంటెంట్ అవమానం, వేధింపులు, మానసిక ఒత్తిడికి కారణమయ్యే అవకాశం ఉందని తెలిపారు. వెల్‌బీయింగ్ కోచ్ డాక్టర్ హనాది అల్ జాబర్ వివరించిన ఓ ఘటన ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. చిన్నతనంలో తల్లిదండ్రులు యూట్యూబ్‌లో పోస్టు చేసిన ఓ బాలుడి వీడియోలను అతడు టీనేజర్‌గా మారిన తర్వాత సహచరులు గుర్తించారు. ఆ వీడియోల్లో బాలుడు మాట్లాడిన తీరు, నవ్విన విధానం, ప్రవర్తనను ఆధారంగా చేసుకుని తోటి విద్యార్థులు అతడిని ఎగతాళి చేశారు. వారు అతడి ఫొటోలతో డిజిటల్ స్టిక్కర్లు తయారు చేసి.. అతడు చిన్నప్పుడు గురక పెట్టిన విధానం, మాట్లాడిన తీరు, నవ్విన తీరును కూడా ఎగతాళి చేసేవారని అల్ జాబర్ తెలిపారు. వేధింపులు తీవ్రం కావడంతో బాలుడు పాఠశాలకు వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. చివరకు వీడియోలను తొలగించాలని బాలుడు కుటుంబాన్ని కోరాడు. అయితే కంటెంట్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉండటంతో దాన్ని పూర్తిగా తొలగించడం సులభం కాలేదు. వీడియోలను తొలగించేందుకు కుటుంబం న్యాయపరమైన సహాయాన్ని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఘటన బాలుడిపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందని, ఒక దశలో అతడు ఆత్మహత్య గురించి ఆలోచించే స్థితికి చేరుకున్నాడని అల్ జాబర్ వెల్లడించారు.

బుర్జీల్ మెడికల్ సిటీలో పీడియాట్రిక్ సైకియాట్రీ సర్వీసెస్ డైరెక్టర్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అమీర్ జావైద్ మాట్లాడుతూ.. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ తమను ఎలా చూపించాలనే విషయంలో వారికి ఎక్కువ నియంత్రణ ఉండాలని అన్నారు. పిల్లల సమ్మతి ఇవ్వగల వయసు రాకముందే వారి జీవితాలను విస్తృతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే.. భవిష్యత్తులో వారికి అవమానం, తల్లిదండ్రులపై నమ్మకం కోల్పోవడం, తమ వ్యక్తిగత హద్దులను గౌరవించలేదనే భావన కలగవచ్చని చెప్పారు. ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులకు సరదాగా లేదా ముద్దుగా అనిపించిన ఫొటో.. అదే పిల్లవాడికి 15 ఏళ్ల వయసులో తీవ్రంగా ఇబ్బందికరంగా అనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

‘ఒకసారి పబ్లిక్ చేస్తే నియంత్రణ కోల్పోతారు’

పిల్లల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పబ్లిక్‌గా ఉంచడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు కేవలం స్కూల్‌లో వేధింపులకు మాత్రమే పరిమితం కావని డాక్టర్ హనాది హెచ్చరించారు. ఆన్‌లైన్‌లోకి వెళ్లిన పిల్లల ఫొటోలు, వీడియోలను అపరిచితులు డౌన్‌లోడ్ చేసుకోవడం, సేవ్ చేయడం, ఇతరులకు పంపడం లేదా పిల్లలను సంప్రదించేందుకు ఉపయోగించే అవకాశం ఉందన్నారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా పిల్లలను గుర్తించి వారితో సంప్రదింపులు ప్రారంభించే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులతో ప్రైవేట్‌గా పంచుకునే ఫొటోకు, ఎవరైనా చూడగలిగేలా పబ్లిక్ సోషల్ మీడియా ఖాతాలో వీడియోను పోస్టు చేయడానికి చాలా తేడా ఉందని నిపుణులు గుర్తుచేశారు.

తమ పాత ఫొటోలు, వీడియోలపై పిల్లలు అసంతృప్తి వ్యక్తం చేస్తే తల్లిదండ్రులు దానిని సీరియస్‌గా తీసుకోవాలని అల్ జాబర్ సూచించారు. “ఈ ఫొటో నాకు నచ్చలేదు.. దీని బదులు మరో ఫొటో పెట్టండి” లేదా “దీన్ని డిలీట్ చేయండి.. నాకు ఇది వద్దు” అని పిల్లలు చెబితే వారి అభిప్రాయాన్ని గౌరవించాలని తెలిపారు. అయితే అదే కంటెంట్‌కు ఎక్కువ వ్యూస్, ఫాలోవర్లు లేదా ఆదాయం రావడం ప్రారంభించినప్పుడు తల్లిదండ్రులు దాన్ని తొలగించేందుకు వెనుకాడే పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

సైకాలజిస్ట్ హిబా బదావి మాట్లాడుతూ.. కుటుంబ జ్ఞాపకాలను భద్రపరచడం కోసం ఫొటోలు, వీడియోలు తీసుకోవడం సాధారణమేనని అన్నారు. అయితే అదే కంటెంట్‌ను ఆదాయం, లాభాలు లేదా సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ కోసం ఉపయోగించడం ప్రారంభించినప్పుడు సమస్య ఏర్పడుతుందని చెప్పారు. పిల్లలను కేవలం కుటుంబ సభ్యుడిగా కాకుండా వ్యూస్, ఫాలోవర్లు లేదా ఆదాయం తెచ్చే ‘కంటెంట్’గా చూడటం మొదలైతే.. భవిష్యత్తులో ఆ పిల్లవాడికి ‘నో’ చెప్పే స్వేచ్ఛ తగ్గిపోవచ్చని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com