700 కిలోల వైర్ల చోరీ.. ముగ్గురు ఆసియన్లకు ఐదేళ్ల జైలు..!!
- August 11, 2026
బహ్రెయిన్: 700 కిలోల విద్యుత్ వైర్ల చోరీ కేసులో ముగ్గురు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. శిక్ష పూర్తైన అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించాలని హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది. 36, 36, 24 ఏళ్ల వయసున్న ముగ్గురు వ్యక్తులు రాస్ జువైద్లోని ఓ సంస్థ గోదాములో చోరీకి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. చోరీకి ముందు అక్కడి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి, అతడిని కుర్చీకి కట్టేసినట్లు విచారణలో తేలింది.
దర్యాప్తు వివరాల ప్రకారం.. 37 ఏళ్ల సెక్యూరిటీ గార్డు రాత్రి విధుల్లో ఉండగా ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు సెక్యూరిటీ గదిలోకి ప్రవేశించి అతడిపై దాడి చేశారు. అనంతరం మరో నలుగురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. గార్డును కుర్చీకి కట్టేసి, ప్రధాన గేటు తాళం చెవిని తీసుకున్నారు. తర్వాత గోదాం తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీగా విద్యుత్ వైర్లను తీసుకెళ్లారు. అనంతరం సెక్యూరిటీ గదిలో గార్డును బంధించి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రి సుమారు 2 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గార్డు గదిలోనే చిక్కుకుపోయాడు. ఉదయం సంస్థ ఉద్యోగి వచ్చి అతడిని గుర్తించి బయటకు తీసుకువచ్చాడు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. కొందరు ఆసియా వ్యక్తులు పెద్ద మొత్తంలో విద్యుత్ వైర్లను స్క్రాప్ షాపులో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టారు. ముగ్గురు నిందితులు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వైర్ల బరువు సుమారు 700 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్క కిలో వైర్ను BD1.800 చొప్పున విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బస్సుకు నకిలీ నంబర్ ప్లేట్
చోరీకి ఉపయోగించిన బస్సును కూడా పోలీసులు పరిశీలించారు. నిందితులు గుర్తుపట్టకుండా ఉండేందుకు బస్సుకు వేరే నంబర్ ప్లేట్ అమర్చినట్లు గుర్తించారు. కేసులో ముగ్గురు నిందితులపై నేరం రుజువు కావడంతో హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం వారిని బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!
- భారత్-యూఏఈ ప్రయాణికులకు అలర్ట్..!!
- పౌరుల సంక్షేమమే కేంద్రంగా భారత దౌత్య విధానం
- రెడీ ఫర్ స్కూల్.. QNLలో ప్రత్యేక వర్క్షాపులు..!!
- 700 కిలోల వైర్ల చోరీ.. ముగ్గురు ఆసియన్లకు ఐదేళ్ల జైలు..!!
- సిరంజీలు, వైల్స్ తరహా ప్యాకేజింగ్లో కాస్మెటిక్స్.. సౌదీలో నిషేధం..!!
- 100 కోట్ల రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం ఆమోదం!
- 2028 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ విహంగాలు: మంత్రి రామ్మోహన్ నాయుడు
- కేరళ పేరును ‘కేరళం’గా మార్చే బిల్లును లోక్సభ ఆమోదం







