కొవ్వొత్తి మంటతో రూమ్మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!
- August 12, 2026
మనామా: మతపరమైన ప్రార్థన సమయంలో వెలిగించిన కొవ్వొత్తిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో తన రూమ్మేట్ మృతికి కారణమైన 21 ఏళ్ల ఆసియా మహిళకు హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం ఆమెను శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
2026 మార్చి 20న ఈ ఘటన చోటుచేసుకుంది. కంపెనీకి చెందిన అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో మతపరమైన ప్రార్థన కోసం మహిళ కొవ్వొత్తిని వెలిగించింది. అనంతరం దానిని చిన్న చెక్క బల్లపై అలాగే మండనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొవ్వొత్తి మంట చెక్క బల్లకు, సమీపంలోని వస్తువులకు అంటుకోవడంతో మంటలు గది మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో గదిలో ఉన్న బాధితురాలు బయటకు రాలేకపోయింది. మంటలు, దట్టమైన పొగ కారణంగా ఇతర మహిళలు ఆమెను రక్షించేందుకు లోపలికి వెళ్లలేకపోయారు.
తాను సాధారణంగా కొవ్వొత్తిని రోజంతా వెలిగించి ఉంచుతానని దర్యాప్తులో తెలిపింది. బల్ల చెక్కతో తయారైందని తెలిసినా కొవ్వొత్తిని ప్లేట్పై లేదా ఇతర సురక్షితమైన ప్రదేశంలో ఉంచలేదని అంగీకరించింది. మధ్యాహ్నం సుమారు 2:20 గంటలకు ఫైర్ అలారం మోగడంతో భద్రతా సిబ్బంది, అత్యవసర సేవలకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
నిందితురాలు తనపై నమోదైన ఆరోపణలను అంగీకరించి, రూమ్మేట్ మృతికి బాధ్యత వహించింది. దీంతో కోర్టు ఆమెకు ఏడాది జైలు శిక్షతో పాటు శిక్ష అనంతరం శాశ్వత బహిష్కరణను విధించింది.
తాజా వార్తలు
- కర్ణాటకలో గుట్కా, పాన్ మసాలా పై నిషేధం
- షార్జాలో మట్టితో నంబర్ ప్లేట్ దాచిన డ్రైవర్ అరెస్ట్..!!
- సౌదీలో భారీగా ఖాట్, హషీష్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..!!
- సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- కొవ్వొత్తి మంటతో రూమ్మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!
- నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!
- శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్న్యూస్..
- సింక్ఫీల్డ్ కప్లో ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం
- చంద్రశేఖరన్ రిజైన్.. టాటా గ్రూప్ షేర్లు పతనం
- అబుదాబి మాల్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సందర్శన







