యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- August 15, 2026
అబుదాబి: యూఏఈలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆగస్టు 14న అల్ ధఫ్రా ప్రాంతంలోని బదా దఫాస్లో మధ్యాహ్నం 2 గంటలకు గరిష్ఠంగా 50.4°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతకు ఇది ఒక డిగ్రీ కంటే తక్కువగానే ఉంది. ఆగస్టు 24న సుహైల్ నక్షత్రం ఉదయించనుండటంతో యూఏఈ వాసులు తీవ్ర వేసవి నుంచి ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గినప్పటికీ, తేమ పెరిగే అవకాశం ఉండటంతో ఉక్కపోత కొనసాగవచ్చని ఎమిరేట్స్ ఆస్ట్రానమీ సొసైటీ చైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపారు. ఈ ఏడాది అత్యధికంగా 51.2°C
ఆగస్టు 5న అల్ ధఫ్రాలోని బదా దఫాస్లో మధ్యాహ్నం 12.45 గంటలకు 51.2°C ఉష్ణోగ్రత నమోదైంది. 2026లో ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఇక ఈ ఏడాది తొలిసారిగా 50°C ఉష్ణోగ్రత ఆగస్టు 1న అబుదాబిలోని అల్ షవామెఖ్లో నమోదైంది.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
* దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీరు తాగాలి.
* ఎండ నేరుగా తగిలే ప్రాంతాల్లో, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎక్కువసేపు ఉండకూడదు.
* తేలికపాటి, వదులైన, లేత రంగు దుస్తులు ధరించాలి.
* ఎండలో శారీరక శ్రమ తీవ్రతను, వ్యవధిని తగ్గించాలి.
* వేసవిలో వాహనాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ముఖ్యంగా టైర్లలో గాలి ఒత్తిడిని పరిశీలించాలి.
కార్మికులకు ప్రత్యేక రక్షణ చర్యలు
యూఏఈలో కార్మికుల భద్రత కోసం మధ్యాహ్నం పనుల నిషేధం అమల్లో ఉంది. జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు నేరుగా ఎండలో, బహిరంగ ప్రదేశాల్లో పని చేయడం నిషేధం. అత్యవసర సేవలకు సంబంధించిన కొందరు కార్మికులకు మినహాయింపు ఉన్నప్పటికీ, యజమానులు నీడ, చల్లదనం కల్పించే పరికరాలు, తాగునీరు, ప్రథమ చికిత్స సదుపాయాలు అందించాల్సి ఉంటుంది.
డెలివరీ కార్మికుల కోసం కూడా ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. మధ్యాహ్నం నిషేధ సమయంలో కాలినడకన డెలివరీలు చేయించడం నిషేధం. ఆ సమయంలో పని చేయడానికి ఇష్టపడని రైడర్లను బలవంతం చేయరాదు. ఒకేసారి మూడు డెలివరీ ఆర్డర్లకు మించి కేటాయించకూడదు. మొత్తం డెలివరీ సమయం 60 నిమిషాలకు మించకూడదు.
దుబాయ్లో ఇప్పటివరకు 8,350 మంది కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 28 మంది ప్రత్యేక వైద్య నిపుణుల సహకారంతో ఈ పరీక్షలు చేపట్టారు. డెలివరీ రైడర్లకు మరో 5,000 హెల్త్ కిట్లు అందించారు. వీటిలో వైద్య, రక్షణ సామగ్రితో పాటు చేతి ఫ్యాన్, కూలింగ్ టవల్ ఉన్నాయి. అదేవిధంగా ‘అల్ ఫ్రీజ్ ఫ్రిజ్’ కార్యక్రమం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు చల్లటి నీరు, జ్యూస్, చల్లని ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఈ ఏడాది 20 లక్షల వస్తువులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
యూఏఈవ్యాప్తంగా 12,000కు పైగా ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. అవసరమైన వస్తువులను డెలివరీ చేసే కార్మికులు వీటిని ఉపయోగించుకోవచ్చు. మొబైల్ యాప్లలో అందుబాటులో ఉన్న ఇంటరాక్టివ్ మ్యాప్స్ ద్వారా సమీప విశ్రాంతి కేంద్రాలను గుర్తించవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







