డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల ఉల్లంఘనపై సౌదీ కఠిన చర్యలు..!!

- August 18, 2026 , by Maagulf
డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల ఉల్లంఘనపై సౌదీ కఠిన చర్యలు..!!

రియాద్: డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల ఉల్లంఘనపై సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. వికలాంగుల సంరక్షణ అథారిటీ (APD) నిబంధనలు ఉల్లంఘించే ప్రభుత్వేతర సంస్థలపై తనిఖీలు, పర్యవేక్షణతో పాటు జరిమానాలు విధించే అధికారాలను నేరుగా అమలు చేయడం ప్రారంభించింది. డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల చట్టంలోని ఆర్టికల్‌ 25ను ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు APD వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు గరిష్ఠంగా SR500,000వరకు జరిమానా విధించనున్నారు. అదే తప్పును మళ్లీ చేస్తే జరిమానాను రెట్టింపు చేయనున్నారు.

డిసబుల్డ్ పర్సన్స్ చట్టం కల్పించిన హక్కులు, సేవలను నిరాకరించడం, వారి పట్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వివక్ష చూపే విధానాలను అవలంబించడం వంటి వాటిని తీవ్రమైన ఉల్లంఘనలుగా పరిగణించనున్నారు. అలాగే డిసబుల్డ్ పర్సన్స్ తమ చట్టపరమైన వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించకుండా అడ్డుకోవడం, విద్య, శిక్షణ, వైద్యం, బీమా, ఆర్థిక సేవలు, రవాణా వంటి సౌకర్యాలను నిరాకరించడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని APD స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు సహా ప్రభుత్వేతర సంస్థల్లో ఈ నిబంధనలు అమలయ్యేలా తనిఖీలు, పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తామని అథారిటీ తెలిపింది. డిసబుల్డ్ పర్సన్స్ కు ఇతరులతో సమానంగా సేవలు, అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com