ఒమన్‌లో ఘనంగా రాజస్థానీ మహిళల ‘తీజ్ ఉత్సవ్’..!!

- August 20, 2026 , by Maagulf
ఒమన్‌లో ఘనంగా రాజస్థానీ మహిళల ‘తీజ్ ఉత్సవ్’..!!

మస్కట్: ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్ రాజస్థానీ విభాగం ఆధ్వర్యంలో ‘తీజ్ ఉత్సవ్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 14న మస్కట్‌లోని ఘాలాలో ఉన్న సెంటారా హోటల్‌లో ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఒమన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రాజస్థానీ విభాగానికి చెందిన మహిళా సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మస్కట్‌తో పాటు బర్కా, సలాలా, సోహార్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఒకే వేదికపైకి చేరిన మహిళలు తీజ్ పండుగ స్ఫూర్తిని చాటిచెప్పారు.

ఈ సందర్భంగా సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. రాజస్థానీ సంప్రదాయ దుస్తుల్లో మహిళలు రంగురంగులుగా ముస్తాబై వేడుకల్లో పాల్గొన్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ.. ఒకరితో ఒకరు ఆత్మీయంగా కలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం కల్పించింది. 

‘తీజ్ ఉత్సవ్’ ద్వారా రాజస్థానీ సంస్కృతి, సామాజిక ఐక్యతను చాటినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒమన్‌లోని రాజస్థానీ మహిళల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు.. రాజస్థాన్‌ గొప్ప సంప్రదాయాలను కొనసాగిస్తూ, సమాజాన్ని మరింత దగ్గర చేయడంలో రాజస్థానీ విభాగం చేస్తున్న కృషికి ఈ వేడుక నిదర్శనంగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com