విండ్‌షీల్డ్ శుభ్రం చేయడం పై పెట్రోల్ పంప్ సిబ్బందితో గొడవ.. ఇద్దరికి భారీ జరిమానా

- August 20, 2026 , by Maagulf
విండ్‌షీల్డ్ శుభ్రం చేయడం పై పెట్రోల్ పంప్ సిబ్బందితో గొడవ.. ఇద్దరికి భారీ జరిమానా

అల్ ఐన్: వాహనం విండ్‌షీల్డ్ శుభ్రం చేయడంపై పెట్రోల్ పంప్ సిబ్బందితో గొడవపడి, అతనిపై దాడి చేసిన ఇద్దరికి యూఏఈలోని అల్ ఐన్ మిస్డీమీనర్ కోర్టు భారీ జరిమానా విధించింది. ఒక్కొక్కరికి Dh50,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

అంతేకాకుండా, నిందితులు దాడి జరిగిన అదే పెట్రోల్ స్టేషన్‌లో రెండు నెలల పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని కోర్టు ఆదేశించింది. విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సేవా ఉద్యోగిపై దాడి చేయడం, ప్రజా శాంతికి భంగం కలిగించినందుకు ఈ శిక్షలు విధించినట్లు కోర్టు తెలిపింది.

కేసు వివరాల ప్రకారం.. ఓ వాహన డ్రైవర్ పెట్రోల్ పంప్ వద్ద తన వాహనం విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేయాలని సిబ్బందిని కోరాడు. అయితే ఆ సమయంలో పెట్రోల్ పంప్ రద్దీగా ఉండటంతో కొంతసేపు వేచి ఉండాలని సిబ్బంది సూచించాడు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వాగ్వాదం కాస్తా తీవ్రరూపం దాల్చి సిబ్బందిపై దాడికి దారితీసింది. ఈ ఘటనలో బాధితుడికి గాయాలు, నొప్పి కలిగినట్లు వైద్య నివేదికలో నమోదైంది.

కేసు విచారణ సందర్భంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, నిందితులు కోర్టులో చేసిన అంగీకారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదిక తదితర ఆధారాలను కోర్టు పరిశీలించింది. వీటి ఆధారంగా నిందితులను దోషులుగా నిర్ధారించింది.

విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రజా సేవకు నియమించబడిన వ్యక్తిని బలప్రయోగం లేదా హింసతో అడ్డుకోవడం, దాడి చేయడం యూఏఈ చట్టాల ప్రకారం నేరమని కోర్టు స్పష్టం చేసింది.

వివాదాలు తలెత్తినప్పుడు స్వయంగా గొడవలకు దిగకుండా చట్టాన్ని పాటిస్తూ అధికారిక మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా న్యాయపరమైన చర్యలను తప్పించుకోవచ్చని కోర్టు సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com