దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక

- August 25, 2026 , by Maagulf
దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక

దుబాయ్: డబ్బులు తీసుకుని వర్క్, రెసిడెన్సీ, విజిట్ వీసాలు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో ప్రచారం చేస్తున్న నకిలీ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కు చెందిన యాంటీ-ఫ్రాడ్ సెంటర్ ఈ హెచ్చరికను జారీ చేసింది. కొందరు మోసగాళ్లు లైసెన్స్ లేని కంపెనీలు, కార్యాలయాల పేర్లను ఉపయోగించడం లేదా అధికారిక సంస్థలుగా నటిస్తూ ప్రజలను నమ్మించి డబ్బులు కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు.

అధికారిక మార్గాల్లోనే వీసా లావాదేవీలు

‘Be Aware of Fraud’ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. వీసాలకు సంబంధించిన అన్ని లావాదేవీలను సంబంధిత ప్రభుత్వ అధికార సంస్థలు లేదా చట్టబద్ధంగా అనుమతించబడిన కార్యాలయాల ద్వారా మాత్రమే నిర్వహించాలని సూచించారు.

తెలియని వ్యక్తులు, మధ్యవర్తులు లేదా నమ్మకంలేని సంస్థలను ఆశ్రయించవద్దని, వీసా ఆఫర్లు లేదా ప్రక్రియలకు సంబంధించిన వివరాలను అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని సూచించారు.

వీసా ఇప్పిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పే తప్పుడు హామీలకు ఆకర్షితులు కావద్దని పోలీసులు హెచ్చరించారు. సేవను అందిస్తున్న సంస్థ నిజమైనదేనా, దానికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా అనే విషయాలను ముందుగా నిర్ధారించుకోవాలని తెలిపారు.

మోసం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి

మోసాలపై అవగాహనతో పాటు సేవ అందించే సంస్థ మూలాన్ని ధృవీకరించుకోవడమే మోసాల నుంచి రక్షణకు తొలి అడుగు అని యాంటీ-ఫ్రాడ్ సెంటర్ పేర్కొంది.

ఎవరైనా మోసానికి గురైనా లేదా మోసపూరిత ప్రయత్నాన్ని గుర్తించినా వెంటనే దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్, సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న eCrime ప్లాట్‌ఫామ్ ద్వారా ఫిర్యాదు చేయాలని లేదా 901కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com