కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!

- August 27, 2026 , by Maagulf
కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!

కువైట్: ఆహార భద్రత, ప్రజారోగ్య నిబంధనలను ఉల్లంఘించిన ఆహార సంస్థలపై కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు చర్యలు చేపట్టారు. అల్‌అర్దియా ఇండస్ట్రియల్ ఏరియా, అల్‌ఖురైన్ మార్కెట్లలో నిర్వహించిన రెండు తనిఖీ కార్యక్రమాల్లో మొత్తం 23 ఉల్లంఘనలను గుర్తించి.. 48 కిలోల ఆహారాన్ని ధ్వంసం చేశారు.

అల్‌అర్దియా ప్రాంతంలో ఫర్వానియా గవర్నరేట్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్, అల్‌రాయ్ ఫుడ్ ఇన్‌స్పెక్షన్ సెంటర్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 48 కిలోల ఆహారాన్ని ధ్వంసం చేయడంతోపాటు 7 ఉల్లంఘనలను గుర్తించారు.

ఆరోగ్య, ప్రజా పరిశుభ్రత నిబంధనలు పాటించకపోవడం, గడువు ముగిసిన ఆరోగ్య లైసెన్సులతో కార్యకలాపాలు నిర్వహించడం, ఆహారాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం, చెల్లుబాటు అయ్యే ఆరోగ్య ధ్రువపత్రాలు లేని కార్మికులను విధుల్లో నియమించడం వంటి ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

మరోవైపు, సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో అల్‌ఖురైన్ మార్కెట్లలో 35 ఆహార సంస్థలను అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 16 ఉల్లంఘనలు గుర్తించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

మానవ వినియోగానికి అనర్హమైన ఆహారాన్ని విక్రయించడం, ఆరోగ్య లైసెన్స్ లేకుండా సంస్థలను నిర్వహించడం, ఆరోగ్య–పరిశుభ్రత నిబంధనలు పాటించకపోవడం, చెల్లుబాటు అయ్యే ఆరోగ్య ధ్రువపత్రాలు లేని వ్యక్తులతో ఆహారాన్ని నిర్వహించడం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఆహార భద్రత, వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ కోసం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com