ఖరీఫ్‌ సీజన్‌లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!

- August 27, 2026 , by Maagulf
ఖరీఫ్‌ సీజన్‌లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!

సలాలా: ధోఫార్‌లో ఖరీఫ్‌ సీజన్‌ సందర్భంగా పర్యాటక ప్రాంతాల్లో వాహనాల్లో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు కదులుతున్న వాహనాల కిటికీల నుంచి బయటకు వాలుతూ కనిపించడం ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గుతున్న సమయంలో ఇలాంటి చర్యలు రోడ్డు భద్రతకు తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఇటీవల వైరలవుతున్న వీడియోలపై ఆందోళన వ్యక్తం అవుతున్నది.చల్లని వాతావరణాన్ని లేదా ఖరీఫ్‌ వాతావరణాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ప్రయాణికులు ఇలా చేస్తున్నప్పటికీ, ఇది అనవసరమైన ప్రమాదాన్ని సృష్టించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఒమన్ ట్రాఫిక్ చట్టాల్లో నిబంధనలు

ఒమన్ ట్రాఫిక్ చట్టం అమలు నిబంధనల్లో ఇలాంటి ప్రవర్తనను స్పష్టంగా ప్రస్తావించారు. వాహనం కిటికీల నుంచి తల, చేతులను బయటకు పెట్టేందుకు అనుమతించడం ప్రయాణికులు, సరుకుల రవాణాకు సంబంధించిన ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ఒకటిగా పేర్కొన్నారు. దీనిని కేటగిరీ-4 ట్రాఫిక్ ఉల్లంఘనగా వర్గీకరించారు. అంటే ప్రయాణికులు మాత్రమే బాధ్యత వహించాల్సిన విషయం కాదని, వాహనంలో ఉన్నవారు సురక్షితంగా లోపలే ఉండేలా చూసే బాధ్యత వాహన బాధ్యతదారులపైనా ఉంటుందని నిబంధనలు సూచిస్తున్నాయి.

ఖరీఫ్‌ సమయంలో ధోఫార్‌లో కనిపించే దట్టమైన పొగమంచు, చిరుజల్లులు, తడిచిన రహదారులు, కొండ ప్రాంతాల్లోని మలుపులు డ్రైవింగ్‌ను మరింత క్లిష్టంగా మారుస్తాయి.పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు, పాదచారులు, జంతువులు లేదా ఇతర ప్రమాదాలను డ్రైవర్లు గుర్తించే దూరం గణనీయంగా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు వాహనం నుంచి బయటకు వాలడం ప్రమాదాన్ని మరింత పెంచుతుందన్నారు.  

ధోఫార్‌లోని పొగమంచు, చిరుజల్లులు, పచ్చని కొండ ప్రాంతాలు ఖరీఫ్‌ ఆకర్షణలో కీలక భాగం. అయితే వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వాహనం అందించే భద్రతను ప్రయాణికులు వదులుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ఖరీఫ్‌ సీజన్‌లో పర్యాటకుల రద్దీ పెరిగే నేపథ్యంలో డ్రైవర్లతో పాటు ప్రయాణికులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం వాహనం వేగం, డ్రైవింగ్ నైపుణ్యంకు సంబంధించినది మాత్రమే కాదని, వాహనంలో ప్రయాణికుల ప్రవర్తన కూడా అందులో కీలక భాగమని ఈ ఘటనలు మరోసారి గుర్తుచేస్తున్నాయని అధికారులు రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com