నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం

- August 30, 2026 , by Maagulf
నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం

అబుదాబి: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనలతో ప్రభావితమైన ప్రజలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యవసర సహాయాన్ని అందించింది. యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 83 టన్నుల సహాయ సామగ్రితో ప్రత్యేక విమానాన్ని నేపాల్‌కు పంపింది.

ఈ సహాయంలో ఆహార పదార్థాలతో పాటు టెంట్లు, ఆశ్రయ సామగ్రి, ఇతర మానవతా అవసరాలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇటీవల నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదలు, కొండచరియల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఇంకా పలువురు ఆచూకీ తెలియకపోవడంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు బాధితుల సహాయార్థం 10 మిలియన్ అమెరికన్ డాలర్లను కేటాయించారు. అత్యవసర పరిస్థితుల్లో అన్ని వయసుల ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు, బాధిత ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ, స్థిరత్వానికి ఈ నిధులను వినియోగించనున్నారు.

నేపాల్‌లోని యూఏఈ రాయబార కార్యాలయంతో కలిసి యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది. బాధితులకు సహాయ సామగ్రిని వేగంగా చేరవేసేలా చర్యలు చేపడుతోంది.

అదేవిధంగా, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత బలోపేతం చేసేందుకు సంబంధిత అంతర్జాతీయ సంస్థలతోనూ యూఏఈ సమన్వయం కొనసాగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com