దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

- August 30, 2026 , by Maagulf
దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

దోహా: పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, స్వతంత్ర ఆలోచన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తూ ఇండియన్ కమ్యూనిటీ బెనివోలెంట్ ఫోరం (ICBF) ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

“Are We Teaching Children to Lead or Teaching Them to Listen?” అనే అంశంపై ICBF కంజాని హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కమ్యూనిటీ నాయకులు, ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ధృవీకృత నాయకత్వ శిక్షకురాలు, కోచ్, మాజీ ICBF మేనేజింగ్ కమిటీ సభ్యురాలు నిర్మల గురు ముఖ్య వక్తగా హాజరయ్యారు.

పిల్లల్లో స్వతంత్ర ఆలోచనకు ప్రాధాన్యం

ముఖ్య ప్రసంగంలో నిర్మల గురు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పెంపకం విధానం పిల్లల స్వతంత్ర ఆలోచన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, బాధ్యతలను స్వీకరించే గుణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని వివరించారు.

పిల్లలకు సహాయం చేయడం, ప్రతి సమస్యను తల్లిదండ్రులే పరిష్కరించడం మధ్య ఉన్న తేడాను సులభంగా అర్థమయ్యే ఉదాహరణలతో వివరించారు. ప్రముఖ కార్టూన్ పాత్ర డోరేమాన్ మ్యాజిక్ పాకెట్ ఉదాహరణను ప్రస్తావిస్తూ.. పిల్లల ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం అందించడం కంటే, వారు స్వయంగా ఆలోచించి పరిష్కారాలను కనుగొనేలా ప్రోత్సహించడం ముఖ్యమని తెలిపారు.

పిల్లల్లో జిజ్ఞాస, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం, స్వీయ నియంత్రణ, స్వతంత్రంగా ఆలోచించే గుణాలను పెంపొందించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.

పిల్లల అభివృద్ధి క్రమాన్ని “వినడం → అర్థం చేసుకోవడం → ప్రశ్నించడం → నిర్ణయం తీసుకోవడం → నాయకత్వం వహించడం”గా ఆమె వివరించారు.

ఘనంగా కార్యక్రమ నిర్వహణ

కార్యక్రమం ICBF జనరల్ సెక్రటరీ దీపక్ శెట్టి స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. అనంతరం ICBF యాక్టింగ్ ప్రెసిడెంట్ రషీద్ అహ్మద్ అధ్యక్ష ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా ICBFకు నిర్మల గురు అందించిన సేవలు, కార్యక్రమం విజయవంతం కావడానికి చేసిన కృషిని గుర్తిస్తూ రషీద్ అహ్మద్ ఆమెకు జ్ఞాపికను అందజేశారు.

ICBF సెక్రటరీ జాఫర్ తయ్యిల్ వందన సమర్పణ చేశారు.

కార్యక్రమంలో ICBF ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కె.వి.బోబన్, ICC మేనేజింగ్ కమిటీ సభ్యుడు  రవీంద్ర ప్రసాద్, శ్రీ మోహన్ కుమార్తో పాటు వివిధ భారతీయ సంఘాల పదాధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

కార్యక్రమ సమన్వయంలో ICBF మేనేజింగ్ కమిటీ సభ్యులు మణి భారతి,మినీ సిబి, శ్రీమతి నీలాంబరి ఎస్,అమర్ వీర్ సింగ్,శంకర్ గౌడ్ కీలక పాత్ర పోషించారు.

పిల్లలను కేవలం మాట వినే వారిగా కాకుండా.. ఆలోచించే, ప్రశ్నించే, నిర్ణయాలు తీసుకునే, భవిష్యత్తులో నాయకత్వం వహించే వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com