బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ యూఏవీ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

- September 01, 2026 , by Maagulf
బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ యూఏవీ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

హైదరాబాద్: బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఇంక్యుబేట్‌ అయిన డిఫెన్స్‌ టెక్నాలజీ స్టార్టప్‌ అపోలియన్‌ డైనమిక్స్‌ రూపొందించిన ఎలక్ట్రిక్‌ ఇంటర్‌సెప్టర్‌ ‘ఆహుతి Mk II’ అరుదైన ఘనత సాధించింది. ఈ మల్టీరోటర్‌ యూఏవీ గంటకు 498 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసి, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. మల్టీరోటర్‌ యూఏవీ సాధించిన అత్యధిక వేగంగా ఈ రికార్డును గుర్తించారు.

జయంత్‌ ఖత్రీ, సౌర్య చౌదరి స్థాపించిన అపోలియన్‌ డైనమిక్స్‌ ఈ విమానాన్ని అభివృద్ధి చేసింది. అమన్‌ విరాణి, మనస్‌ విచారే, ఇషాన్‌ సూరి సభ్యులుగా ఉన్న బృందం ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించింది.

ఏడాదిలోనే భారీ వేగం పెంపు
‘ఆహుతి Mk II’కు ముందు రూపొందించిన ‘ఆహుతి’ 2025లో గంటకు సుమారు 300 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. అయితే కొత్త మోడల్‌లో చిన్నచిన్న మార్పులతో సరిపెట్టకుండా మొత్తం ప్లాట్‌ఫామ్‌ను మొదటి నుంచి పునర్నిర్మించారు. అధిక వేగంతో పనిచేసే ఇంటర్‌సెప్టర్‌గా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

దీంతో ఏడాది లోపే గరిష్ఠ వేగం గంటకు 300 కిలోమీటర్ల నుంచి 498 కిలోమీటర్లకు పెరిగింది. ఇది సుమారు 66 శాతం వేగవృద్ధి కావడం విశేషం.

డ్రోన్లు, లొయిటరింగ్‌ మ్యూనిషన్స్‌ను ఎదుర్కొనేందుకు
ఆధునిక యుద్ధ పరిణామాల నేపథ్యంలో ‘ఆహుతి Mk II’ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో పెద్ద సంఖ్యలో వినియోగించే లొయిటరింగ్‌ మ్యూనిషన్స్‌, శత్రు డ్రోన్లను అడ్డుకునే ఇంటర్‌సెప్టర్‌గా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు.

“వేగం మాకు కేవలం స్పెసిఫికేషన్‌ కాదు. ఒక ముప్పును అడ్డుకున్నామా లేదా అది మన రక్షణను దాటి వెళ్లిందా అన్నది వేగమే నిర్ణయిస్తుంది. గంటకు 498 కిలోమీటర్ల వేగం అంటే ఆ రేసులో మనమే గెలుస్తాం” అని సంస్థ సహ వ్యవస్థాపకులు జయంత్‌ ఖత్రీ, సౌర్య చౌదరి పేర్కొన్నారు.

2030 నాటికి మరింత కీలక ప్రాజెక్టుల పై దృష్టి
ఇప్పటికే భారత సైన్యంతో కలిసి తమ వ్యవస్థలను ఫీల్డ్‌ చేసిన అపోలియన్‌ డైనమిక్స్‌ భవిష్యత్‌ రక్షణ సాంకేతికతపై దృష్టి సారిస్తోంది. 2030 నాటికి అధిక సామర్థ్యం కలిగిన పవర్‌ క్రూయిజ్‌ మిసైల్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడం తమ దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఒకటని సంస్థ వెల్లడించింది.

స్వదేశీ సాంకేతికతతో అధునాతన మానవరహిత రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలన్న తమ లక్ష్యానికి ‘ఆహుతి Mk II’ సాధించిన రికార్డు మరో ముఖ్యమైన ముందడుగు అని కంపెనీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com