ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు

- September 01, 2026 , by Maagulf
ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద సంఖ్యలో ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం (CM Chandrababu) కల్పిస్తామని ఆయన వెల్లడించారు. మంగళవారం మొగల్తూరులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు.

ఏపీకి చెందిన అర్హులైన మహిళలు చెల్లుబాటు:
మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఆగస్టు 15న ప్రారంభించింది. ప్రస్తుతం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ వంటి సర్వీసుల్లో ఈ ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఏపీకి చెందిన అర్హులైన మహిళలు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంతో ప్రయాణించవచ్చు.

అయితే ఈ పథకం ప్రారంభమైన సమయంలో ఏసీ, స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, నాన్‌స్టాప్, అంతర్రాష్ట్ర తదితర సర్వీసులకు ఉచిత ప్రయాణం వర్తించలేదు. తాజా సీఎం ప్రకటనతో భవిష్యత్తులో ప్రవేశపెట్టనున్న ఏసీ బస్సుల విషయంలో ఈ పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ‘స్త్రీ శక్తి’ పథకానికి మహిళల నుంచి భారీ స్పందన లభిస్తోంది. పథకం ప్రారంభమైన ఏడాది కాలంలో సుమారు 87 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయని, రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగిస్తున్నారని అధికారిక సమాచారం వెల్లడించింది.

మహిళల ప్రయాణ ఖర్చులను తగ్గించడంతో పాటు ఉద్యోగాలు, విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం వారి రాకపోకలను సులభతరం చేయడమే పథకం ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఏసీ బస్సులకు కూడా ఉచిత ప్రయాణాన్ని విస్తరించనున్నట్లు సీఎం ప్రకటించడంతో మహిళలకు మరింత ప్రయోజనం కలగనుంది. అయితే ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఏయే ఏసీ సర్వీసులకు వర్తిస్తుంది, ఎలాంటి నిబంధనలు ఉంటాయన్న వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com