పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!

- September 02, 2026 , by Maagulf
పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌కు వెళ్లే పర్యాటకులకు కీలక మార్పు చోటుచేసుకుంది. 60కి పైగా దేశాలు, భూభాగాలకు చెందిన ప్రయాణికులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల వీసా-ఫ్రీ బసను 30 రోజులకు తగ్గించాలని థాయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. పర్యాటకం థాయ్‌లాండ్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనప్పటికీ, విదేశీయులు వీసా నిబంధనలను దుర్వినియోగం చేసి నేరాలకు పాల్పడుతున్న ఘటనలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

భారత్, అమెరికా, చైనాకు కూడా వర్తింపు

ప్రస్తుతం 90కి పైగా దేశాలకు చెందిన పర్యాటకులు థాయ్‌లాండ్‌లో 60 రోజుల వరకు వీసా లేకుండా ఉండే అవకాశం ఉంది. ఇందులో చైనా, భారత్, అమెరికాతో పాటు యూరప్‌లోని 29 దేశాల షెంగెన్ ప్రాంతానికి చెందిన దేశాలు, పలు దక్షిణ అమెరికా దేశాలు ఉన్నాయి. కొత్త నిబంధన ప్రకారం 60కి పైగా దేశాలు, భూభాగాలకు 30 రోజుల వీసా-ఫ్రీ బస మాత్రమే లభిస్తుంది. ఇందులో చైనా, అమెరికా, 27 యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే మరో సుమారు 20 దేశాలకు సంబంధించిన వీసా-ఫ్రీ నిబంధనల్లో మార్పులపై స్పష్టత రావాల్సి ఉంది.  

కొన్ని దేశాలకు 90 రోజుల అవకాశం

అన్ని దేశాలకూ స్టే కాలాన్ని తగ్గించలేదు. పెరూ, బ్రెజిల్, దక్షిణ కొరియా పౌరులకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌లో ఉండే గడువును 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచారు. 30 రోజుల వీసా-ఫ్రీ గడువు పూర్తయిన తర్వాత పర్యాటకులు ఒకసారి తమ బసను పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అయితే పొడిగింపును అనుమతించాలా వద్దా అనేది సంబంధిత ఇమ్మిగ్రేషన్ అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
విదేశీయుల నేరాలపై కఠిన చర్యలు

వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసుకుని దేశంలో నేరాలకు పాల్పడుతున్న విదేశీయులపై చర్యలను కఠినతరం చేయడంలో భాగంగానే వీసా-ఫ్రీ బసను తగ్గిస్తున్నట్లు థాయ్ విదేశాంగ మంత్రి సిహాసక్ ఫువాంగ్‌కెట్‌కియో తెలిపారు. ఇటీవల డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలు, అక్రమ రవాణా, సరైన అనుమతులు లేకుండా హోటళ్లు, పాఠశాలలు వంటి వ్యాపారాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో పలువురు విదేశీయులను థాయ్ అధికారులు అరెస్టు చేశారు.

విదేశీ పర్యాటకులు తగ్గుముఖం

అధికారిక గణాంకాల ప్రకారం, 2026లో ఇప్పటివరకు 20.9 మిలియన్ల విదేశీ పర్యాటకులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య 3 శాతం తగ్గింది. పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా, అదే సమయంలో వీసా నిబంధనల దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com