విద్యుత్, నీటి నెట్వర్క్లకు నష్టం జరగకుండా ఖతార్లో కొత్త నిబంధనలు..!!
- September 11, 2026
దోహా: నిర్మాణ, తవ్వకాలు, కూల్చివేతలు, ల్యాండ్స్కేపింగ్ వంటి పనుల సమయంలో ప్రభుత్వ విద్యుత్, నీటి మౌలిక సదుపాయాలకు నష్టం జరగకుండా ఖతార్ ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అఫైర్స్ సాద్ షెరీదా అల్-కాబీ ఉత్తర్వులను జారీ చేశారు. సెప్టెంబర్ 2026లో న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్లో ఈ ఉత్తర్వులు ప్రచురితమయ్యాయి. 2024లో తీసుకొచ్చిన ప్రభుత్వ విద్యుత్, నీటి సదుపాయాల పరిరక్షణ చట్టం ఆధారంగా ఈ నిబంధనలు రూపొందించారు.
విద్యుత్, నీటి నెట్వర్క్లు ఉన్న ప్రాంతాల్లో లేదా వాటికి సమీపంలో నిర్మాణం, తవ్వకాలు, కూల్చివేతలు, భవనాల విస్తరణ వంటి పనులు చేపట్టే వారు సంబంధిత అధికారుల అనుమతులు, షరతులను తప్పనిసరిగా పాటించాలి.విద్యుత్, నీటి నెట్వర్క్లపై నిర్మించే వంతెనలు, ఫ్లైఓవర్లు, ఓవర్పాస్లకు కనీసం 5 మీటర్ల ఎత్తు ఉండాలి. యుటిలిటీ నెట్వర్క్ సరిహద్దులకు 1.5 మీటర్ల పరిధిలో యంత్రాలను ఉపయోగించడం నిషేధం. ప్రత్యేక అనుమతి ఉంటే మాత్రమే మినహాయింపు ఉంటుంది. నెట్వర్క్లకు 1.5 మీటర్ల పరిధిలో 2 మీటర్లకు మించి లోతైన తవ్వకాలు చేపడితే నేల కూలిపోకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి పనులు జరుగుతున్న సమయంలో అనుభవం, తగిన అనుమతులు కలిగిన ఇంజనీర్ పని ప్రదేశంలో నిరంతరం అందుబాటులో ఉండాలని నిర్దేశించారు.
చెట్లు, మొక్కలపైనా నిబంధనలు
విద్యుత్, నీటి సర్వీస్ కారిడార్లలో పెద్ద చెట్లు, పెద్ద పొదలు నాటడంపై ఆంక్షలు విధించారు. నిర్దేశిత ఎత్తు, వేర్ల లోతు పరిమితులకు లోబడి గడ్డి, పచ్చిక ప్రాంతాలు, చిన్న పొదలను మాత్రమే అనుమతిస్తారు.నీటి నెట్వర్క్లకు సమీపంలో అవసరమైన చోట రూట్ బ్యారియర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
తవ్వకాలు, నిర్మాణ పనుల నుంచి వచ్చే వ్యర్థాలను విద్యుత్, నీటి నెట్వర్క్లకు కనీసం 1.5 మీటర్ల దూరంలో ఉంచాలి. అలాగే 5 టన్నులకు మించిన బరువున్న యంత్రాలతో యుటిలిటీ కారిడార్కు 1.5 మీటర్ల పరిధిలో వ్యర్థాలను తొలగించడం కహ్రామా (KAHRAMAA) అనుమతి లేకుండా సాధ్యం కాదు.
పనులు పూర్తయ్యాక ప్రాంతాన్ని పునరుద్ధరించాలి
కాంట్రాక్టర్లు, సంబంధిత సంస్థలు లైసెన్స్ పొందిన తగిన పరికరాలనే ఉపయోగించాలి. భూగర్భంలో ఉన్న విద్యుత్, నీటి సదుపాయాలను ముందుగానే ఖచ్చితంగా గుర్తించాలి. అవసరమైతే పనులు ప్రారంభించే ముందు మాన్యువల్గా ట్రయల్ తవ్వకాలు చేపట్టాలి. అనుమతితో చేపట్టిన పనులు పూర్తయిన తర్వాత ప్రభావిత ప్రాంతాన్ని మునుపటి పరిస్థితికి తిరిగి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ నిబంధనల అమలును కహ్రామా పర్యవేక్షించనుండగా, సంబంధిత ప్రభుత్వ విభాగాలు అనుమతించిన నిర్మాణ, తవ్వకాల పనులను పర్యవేక్షిస్తాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







