6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం

- September 12, 2026 , by Maagulf
6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం

న్యూ ఢిల్లీ: బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలతో పాటు రవాణా కనెక్టివిటీ మరింత పుంజుకుంటోంది.దాదాపు 6 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ గ్వాంగ్‌జౌ మరియు దిల్లీ మధ్య నేరుగా ప్రయాణికుల విమాన సేవలను సెప్టెంబర్ 21 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి, ఆపై సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతల వల్ల నిలిచిపోయిన ఈ డైరెక్ట్ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడం ఇరు దేశాల వ్యాపార, పర్యాటక రంగాలకు ఊతాన్నివ్వనుంది. దక్షిణాసియా ప్రాంతంలో మొత్తం 8 ప్రధాన రౌండ్-ట్రిప్ మార్గాల్లో వారానికి 100కు పైగా విమానాలను నడిపేలా చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే చైనా ఈస్టర్న్, ఎయిర్ చైనాతో పాటు భారత విమానయాన సంస్థ ఇండిగో కూడా కోల్‌కతా, దిల్లీల నుంచి షాంఘై, కున్మింగ్, గ్వాంగ్‌జౌ నగరాలకు సేవలను పునరుద్ధరించడం గమనార్హం.

ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
న్యూ ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ అధినేతల సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు చేరుకున్నారు. 2019 తర్వాత అంటే దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2020 గల్వాన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతల సమీక్ష, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పునరుద్ధరణ తదితర కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల మధ్య పరస్పర సహకారం, సాంకేతికత, ఆర్థిక విధానాల బలోపేతానికి బ్రిక్స్ వేదికగా చైనా ప్రాధాన్యత ఇవ్వనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com