అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్

- September 15, 2026 , by Maagulf
అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్

దుబాయ్: యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) 2026ను సందర్శించారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరుగుతున్న 33వ ఎడిషన్ ట్రావెల్ అండ్ టూరిజం ప్రదర్శన సెప్టెంబర్ 17 వరకు కొనసాగనుంది.

ఈ పర్యటనలో షేక్ మహమ్మద్ వెంట దుబాయ్ రెండో డిప్యూటీ పాలకుడు షేక్ అహ్మద్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రదర్శనలోని వివిధ స్టాళ్లను సందర్శించిన షేక్ మహమ్మద్.. ప్రపంచ ట్రావెల్, టూరిజం రంగ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిణామాలను పరిశీలించారు. దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెలాల్ సయీద్ అల్ మర్రీ ఈ ఏడాది ATM ప్రత్యేకతలను ఆయనకు వివరించారు.

ప్రపంచ ట్రావెల్, టూరిజం రంగానికి దుబాయ్‌ను కీలక వేదికగా మరింత బలోపేతం చేయడంలో ATM కీలక పాత్ర పోషిస్తోందని షేక్ మహమ్మద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భాగస్వామ్యాలు, జ్ఞాన మార్పిడి, పెట్టుబడులు, కొత్త వ్యాపార అవకాశాలకు మార్గం సుగమమవుతోందని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో భారీగా పాల్గొంటున్న సంస్థలు, ప్రతినిధులు దుబాయ్‌పై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.

“ట్రావెల్, టూరిజం రంగంలో యూఏఈ తన ప్రపంచ స్థాయి హబ్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. స్పష్టమైన దార్శనికత, ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, ప్రపంచానికి అందుబాటులో ఉండే విధానం, అద్భుతమైన సందర్శకుల అనుభవాలపై దృష్టితో దుబాయ్ ఈ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రముఖ గమ్యస్థానంగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది” అని షేక్ మహమ్మద్ తెలిపారు.

ప్రపంచ ట్రావెల్, టూరిజం రంగంలోని ప్రముఖులు, నిర్ణయాధికారులు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ATM కొత్త వృద్ధి అవకాశాలను అన్వేషించేందుకు, రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు.

పలు దేశాల పావిలియన్ల సందర్శన

పర్యటనలో భాగంగా షేక్ మహమ్మద్ కువైట్ ఎయిర్‌వేస్, బహ్రెయిన్, ఖతార్ ఎయిర్‌వేస్, ఖతార్, దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం, అబుదాబి, ఎతిహాద్ ఎయిర్‌వేస్, స్పెయిన్ తదితర జాతీయ, అంతర్జాతీయ పావిలియన్లను సందర్శించారు.

అలాగే ప్రముఖ అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థలు మైనర్ హోటల్స్, స్టోరీ హాస్పిటాలిటీ, మారియట్ బోన్వాయ్, IHG హోటల్స్ అండ్ రిసార్ట్స్ స్టాళ్లను కూడా ఆయన పరిశీలించారు.

ఎగ్జిబిటర్లు ప్రదర్శించిన సరికొత్త సేవలు, సాంకేతిక పరిష్కారాలు, ఆవిష్కరణలతో పాటు ట్రావెల్ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సస్టైనబుల్ టూరిజం, స్మార్ట్ మొబిలిటీ వంటి అంశాలపై ప్రదర్శించిన పరిష్కారాలు ప్రత్యేకంగా నిలిచాయి.

‘ట్రావెల్ 2040’ థీమ్‌తో ATM 2026

‘Travel 2040: Driving New Frontiers Through Innovation and Technology’ అనే థీమ్‌తో ATM 2026 నిర్వహిస్తున్నారు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులు, ప్రయాణికుల మారుతున్న అంచనాలు, గమ్యస్థానాల స్థిరత్వం, స్మార్ట్ మొబిలిటీ, సుస్థిర దీర్ఘకాలిక వృద్ధి వంటి అంశాలపై ఈ ఏడాది కార్యక్రమంలో ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పర్యాటక సంస్థలు, విమానయాన సంస్థలు, హోటళ్లు, ట్రావెల్ టెక్నాలజీ కంపెనీలు, సేవా సంస్థలు, పరిశ్రమ నిపుణులు, నిర్ణయాధికారులు ఈ 33వ ఎడిషన్‌లో పాల్గొంటున్నారు.

ట్రావెల్, టూరిజం రంగ భవిష్యత్తును ప్రభావితం చేసే సవాళ్లు, అవకాశాలు, సాంకేతిక పరిణామాలపై పర్యాటక రంగ ప్రముఖులు, విధాన నిర్ణేతలు, టెక్నాలజీ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులతో ప్రత్యేక సదస్సులు, చర్చలు నిర్వహిస్తున్నారు.

మిడిల్ ఈస్ట్‌లో ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ అండ్ టూరిజం ఈవెంట్‌గా ATM తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ.. ప్రపంచ ట్రావెల్ కమ్యూనిటీని ఒకే వేదికపైకి తీసుకొచ్చి భాగస్వామ్యాలు, జ్ఞాన మార్పిడి, ఆవిష్కరణలు, సుస్థిర వృద్ధికి కొత్త అవకాశాలను అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com