పాచిపోయిన రెండు లడ్డూలు ఆంధ్రులకు ...

- September 09, 2016 , by Maagulf
పాచిపోయిన రెండు లడ్డూలు ఆంధ్రులకు ...

 ప్రత్యేక హోదా ఇస్తామంటూ గత రెండేళ్ల నుంచీ వూరిస్తున్న కేంద్రం పాచిపోయిన రెండు లడ్డూలు ఆంధ్రులకు ఇచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. ప్యాకేజీ ఇస్తారనుకుంటే రెండు లడ్డూలు చేతిలో పెట్టారని చెప్పారు. భాజపా, తెదేపా నేతలంతా అదిగదిగో అంటూ ప్రజలను ఆశ పెట్టారని చెప్పారు. అవకాశవాద రాజకీయాల వల్ల గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో విభేదాల్లేవని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను అవకాశవాదంగా మార్చుకుంటున్న వారిని హెచ్చరిస్తున్నానని చెప్పారు. రాజకీయనాయకులంతా దేశంలోని సమస్యలు తీర్చలేకపోయినా పర్వాలేదని...

మరింతగా పెంచొద్దని హితవు పలికారు.
కాకినాడలో జనసేన ఆధ్వర్యంలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తున్నారు. సభ ప్రారంభంకాగానే ఆయన ప్రజలందరికీ అభివాదం చేస్తూ దేశ భక్తి ఉత్తర భారతీయులకే కాదు దక్షిణభారతీయులకూ ఉందన్నారు. భారత రాజ్యాంగంపై ఉత్తరాదికి ఎంత గౌరవం ఉందో దక్షిణ భారతానికీ అంతే గౌరవం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలచేత భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేయించారు.
రెండు పార్టీలూ కలిసి అస్థిరత సృష్టించాయి 
కాంగ్రెస్‌ది 150 ఏళ్ల చరిత్రేనని ఒప్పుకుంటానని.. కానీ లాల్‌బహదూర్‌ శాస్త్రి నాటి విలువలున్నాయా? ఇందిరాగాంధీ పాటించిన సిద్ధాంతాలు పాటిస్తున్నారా అని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. 2004లో అవకాశవాద రాజకీయాల కోసం, పదవుల కోసం పాకులాడారన్నారు. కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందని.. న్యాయం చేయమని భాజపా వద్దకు వెళ్తే అది పొట్టలో పొడిచిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయవాదం గురించి గొప్పలు చెప్పే ఆ రెండు జాతీయ పార్టీలు నేడు తెలుగు రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించాయని ఆవేశంగా ప్రసంగించారు. తెలుగురాష్ట్రాన్ని విడగొట్టిన మీరు అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయలేదని చెప్పారు. అటు తెలంగాణకు హైకోర్టును ఇవ్వకపోగా.. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ఇవ్వకుండా రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని మండిపడ్డారు.
 
బంద్‌లతో మీరెందుకు కష్టపడాలి 
భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఇక్కడికి రాలేదని మనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకే వచ్చానని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. బంద్‌లు చేయాలని తాను చెప్పనని.. అయితే రేపు వైకాపా, వామపక్షాలు ప్రకటించిన బంద్‌లో పాల్గొనాలా వద్దా అనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నాని కార్యకర్తలకు చెప్పారు. అయితే బంద్‌ చేసి మీరెందుకు కష్టపడాలి, పదవులు అనుభవిస్తున్నవారు పోరాడాలి.. అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఏ తప్పూ చేయని ప్రజలు పోరాడుతూంటే వాళ్లు మిన్నకుంటామంటే తాను ఒప్పుకోనన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే ప్రజల తరఫున పోరాడాలని.. వారు చేయాల్సింది చెయ్యకుండా ప్రజలే అన్నీ చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com