తిరుపతిలో 'చంద్రన్న బీమా' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

- October 02, 2016 , by Maagulf
తిరుపతిలో 'చంద్రన్న బీమా' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో 'చంద్రన్న బీమా' పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అసంఘటిత రంగ కార్మికులకు బీమా పథకం ప్రారంభించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పారు. చంద్రన్న బీమా ద్వారా 2కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు లబ్ది పొందుతారని వెల్లడించారు. మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి రోజున బీమా పథకం ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్యానించారు.

దేశానికి స్వాతంత్య్ర సాధించిపెట్టిన మహాత్మాగాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అనునిత్యం పేదవారి సంక్షేమం కోసమే పనిచేయాలని తన జీవితాశయంగా మార్చుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రమే తన కుటుంబమని.. ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ భరోసా కింద వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు.

చంద్రన్న బీమా వివరాలు:
* ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తిస్థాయి అంగవైకల్యం సంభవించినా రూ.5లక్షలు 
* ఏదైనా ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.3,62,500 
* సహజంగా మరణిస్తే రూ.30వేలు 
* ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల పిల్లల్లో ఇద్దరికి రూ.1200 చొప్పున ఉపకార వేతనం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com