ఇథియోపియా లో ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

- October 09, 2016 , by Maagulf
ఇథియోపియా లో  ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

 అడిస్‌ అబాబా (ఇథియోపియా): దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అడ్డుకునేందుకు ఇథియోపియా ప్రభుత్వం ఆదివారం నాడు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఒరామియా ప్రాంతంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోవటం, ఆస్తినష్టం జరగటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ శక్తులతో కుమ్మక్కయి దేశంలో శాంతికి విఘాతం కలిగిస్తున్న శక్తులను ఏరిపారేసేందుకు వీలుగా శనివారం సాయంత్రం నుండి దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి తేవాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు ఇథియో అధికార మీడియా ఆదివారం ఉదయం వెల్లడించింది.

నిరసనల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలలో జరిగిన ప్రాణ, ఆస్తినష్టంపై చర్చించిన మంత్రిమండలి ఎమర్జెన్సీ విధించాలని ప్రధాని హైలేమరియం దెసాలెన్‌కు సిఫార్సు చేసినట్లు మీడియా తన వార్తా కథనాలలో వివరించింది. ఆదివారం ఉదయం నుండి దేశంలోని అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలిగినట్లు స్థానికులు వెల్లడించారు. నిరసనకారులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం గత వారం రోజులుగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com