నెహ్రూ జూ పార్క్ నుంచి తప్పించుకున్న రాయల్ బెంగాల్ టైగర్ పట్టివేత
- August 22, 2015
సమయం మధ్యాహ్నం రెండున్నర గంటలు కావస్తోంది. జవహర్లాల్ నెహ్రూ జూ పార్కులోని జంతువులను చూస్తూ పిల్లలు కేరింతలు కొడుతున్నారు. ఇంతలో పెద్దపెద్దగా విజిల్స్ వినిపించాయి. 'అంతా బయటకు పారిపోండి' అంటూ సిబ్బంది మైకుల్లో ప్రకటన చేస్తున్నారు. దీనికి కారణం.. ఎన్క్లోజర్లో ఉండాల్సిన బెంగాల్ టైగర్ బయటకు రావడమే. పులి బయటకు వచ్చే సమయంలో అక్కడ పనిచేస్తున్న కీపర్లు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే జూ అధికారులు, వెటర్నరీ అధికారులు ఆపరేషన్ మొదలుపెట్టి ఆ పులిని మత్తులోకి పంపారు. సుమారు రెండు గంటలపాటు సాగిన 'ఆపరేషన్ బెంగాల్ టైగర్' అటు సందర్శకుల్లోనూ, ఇటు జూ అధికారుల్లోనూ టెన్షన్ పుట్టించింది. ఇదీ జరిగింది. జూలోని ఆడ పులితో బ్రీడింగ్ చేయించడానికి ఐదు నెలల క్రితం కర్ణాటకలోని మంగుళూరు జూ నుంచి కదంబ అనే మగ బెంగాలీ టైగర్ను తీసుకొచ్చారు. బ్రీడింగ్ కోసం ఒక ఎన్క్లోజర్ను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వేరే ఎన్క్లోజర్లో ఉన్న కదంబను బ్రీడింగ్ ఎన్క్లోజర్లోకి పంపారు. మరోవైపు ఆడ పులిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలో ఎన్క్లోజర్ నుంచి కదంబ బయటకు వచ్చేసింది. పక్కనే వివిధ జంతువుల వద్ద పనిచేస్తున్న కీపర్లు దీనిని గమనించి జూ అధికారులకు సమాచారమిచ్చారు. కొంతమంది అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మరోవైపు పులి సందర్శకుల వైపునకు వెళ్లకుండా అన్ని మార్గాలను మూసివేశారు. ట్రంక్విలైజర్ గన్తో మత్తు ఇచ్చి బెంగాల్ టైగర్ను బోనులో బంధించారు. ఈ బెంగాల్ టైగర్ కీపర్ల వైపు వెళ్తే పెద్ద ప్రమాదమే జరిగేది. అలాగే దీన్ని వారు గుర్తించకపోతే సందర్శకులకు ఊహించని ప్రమాదం ముంచుకొచ్చేది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీకే శర్మతోపాటు అటవీశాఖ ఉన్నతాధికారులు జూపార్కును సందర్శించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి, భాద్యులపై చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. బెంగాల్ టైగర్ ఎన్క్లోజర్ నుంచి బయటకు రావడంతో భద్రతపై చర్చ మొదలైంది. మనుషుల ప్రాణాలు తీసే క్రూర జంతువులను బంధించే ఎన్క్లోజర్ను సక్రమంగా నిర్మించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రీడింగ్ కోసం నూతనంగా నిర్మించిన ఎన్క్లోజర్ పైన ఖాళీగా ఉంది. దీని నుంచి బెంగాల్ టైగర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. జూ అధికారులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. ''ఈ పులి 250 కిలోల బరువుంటుంది. పది అడుగుల ఎత్తు ఉన్న ఎన్క్లోజర్ పైకి ఎక్కి ఇది బయటకు దూకే అవకాశాలు లేవు'' అని అధికారులు చెబుతున్నారు. ఎన్క్లోజర్ చుట్టూ ఉన్న ఇనుప కంచె ఎక్కి పులి బయటకు వచ్చిందని కీపర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









