దీపావళి పండుగ సందర్భంగా చెన్నై నగరంలో 21 ప్రమాదాలు...

- October 30, 2016 , by Maagulf
దీపావళి పండుగ సందర్భంగా చెన్నై నగరంలో 21 ప్రమాదాలు...

దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం నుండి శనివారం సాయంత్రం దాకా బాణసంచా పేలుడు వల్ల రాష్ట్రవ్యాప్తంగా 243 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. నగరంలో రెండు రోజుల వ్యవధిలో 21 చోట్ల బాణాసంచా వల్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. కడలూరు సమీపంలో టపాకాయల దుకాణం కాలిపోయిన ప్రమాదాల్లో ఒకరు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పలుచోట్ల రాకెట్‌ టపాకాయలు పడి 16 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.

రాష్ట్ర అగ్నిమాపకదళం ఉన్నతాధికారి రాజేశఖన్నా తెలిపిన వివరాల మేరకు గత యేడాది కంటే ఈ యేడాది ప్రమాదాల సంఖ్య పెరిగింది. దీనికి కారణం ఎండలు అధికంగా ఉండటమేనని చెప్పారు.
శుక్రవారం రాత్రి కడలూరు జిల్లా తిరుప్పాతిపులియూరులో టపాకాయల దుకాణంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వారిలో జయపాల్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆత్తూరు వద్ద పాత సామాన్ల కొట్టుపై టపాకాయలు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. లక్షలాది రూపాయల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఇక తిరుత్తణి, ఆత్తూరు, చెన్నై, అరియలూరు, తిరువెట్రియూరు సహా పలు ప్రాంతాల్లో టపాకాయలు పేల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించి 16 గుడిసెలు దగ్ధమయ్యాయి. దిండుగల్‌ జిల్లా మేగంపూర్‌లో రాకెట్‌ టపాకాయలు దూసుకెళ్లి మూడు గుడిసెలకు నిప్పంటుకుంది. కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీపంలోని పాంచారు శరణార్థుల శిబిరంపై టపాకాయలు పేలడంతో ఆరు పూరిగుడిసెలు కాలిపోయాయి. అగ్నిమాపక దళం సభ్యులు పోరాడి మంటలను ఆర్పివేశారు. చెన్నైనగరంలో గత 48 గంటల వ్యవధిలో ఫైర్‌స్టేషన్స్ కు 84 అత్యవసర ఫోన కాల్స్‌రాగా వాటిలో 63 ఫోన కాల్స్‌ దీపావళి అగ్ని ప్రమాదాలకు సంబంధించినవేనని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. గత నాలుగేళ్ళతో పోల్చుకుంటే ఈ యేడాది బాణా సంచాల వల్ల సంభవించిన అగ్ని ప్రమాదాల సంఖ్య ఎక్కువేనని అగ్నిమాపకశాఖ జారీ చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com