విశాల్‌, కార్తీలపై రాధిక ఫైర్‌...

- November 28, 2016 , by Maagulf
విశాల్‌, కార్తీలపై రాధిక ఫైర్‌...

 నడిగర్‌ సంఘం నుండి తాత్కాలికంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ మునుపటి కార్యవర్గంలోని అధ్యక్షుడు శరతకుమార్‌, కార్యదర్శి రాధారవి దాఖలు చేసిన పిటీషన్‌ను మద్రాస్‌ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కొన్ని రోజుల క్రితం దాఖలైన ఈ కేసు సోమవారం విచారణకు రాగా... గత ఆదివారం జరిగిన నడిగర్‌ సంఘం సర్వసభ్య సమావేశంలో శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించడం వల్ల జస్టిస్‌ ఎంఎం సుందరేశ్ ఈ కేసును కొట్టివేశారు. అయితే శాశ్వత తొలగింపుపై శరతకుమార్‌ కొత్త పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు. ఇదిలా ఉండగా, శరతకుమార్‌ తొలగింపుపై ఆదివారం ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాధిక సోమవారం మీడియాతో ఆవేశంగా మాట్లాడారు.'ఇద్దరు పెద్ద నటుల్ని తొలగిస్తున్నామని సర్వసభ్య సమావేశంలో ఎజెండాలో ఉన్నప్పుడు అందరికీ తెలియజేయాలి. తెలిసుంటే నేనూ వెళ్లుండేదాన్ని. సరే, శరతకుమార్‌ని తొలగించేందుకు అందరూ సమ్మతించారా? అసలు సొసైటీ చట్టం ప్రకారం ఎవర్నీ శాశ్వతంగా తొలగించకూడదు.దీని గురించి అడిగితే... ఈ విషయం గురించే మాకు తెలీదని నటుడు ప్రభు, ఇంకా చాలామంది నటులు చెప్పారు. దీనర్ధం ఏమిటి? శరతకుమార్‌ వేసిన కేసు సోమవారం విచారణ జరుగబోతుందని అందరికీ తెలుసు.విచారణ దశలో ఉన్న కేసుకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకూడదని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పింది. అయినా ముందు రోజు శాశ్వతంగా తొలగించడమేంటి?' అని రాధిక ప్రశ్నాస్ర్తాలను సంధించారు. అంతేకాదు, ఈ సర్వసభ్య సమావేశమే చెల్లదని, వేదిక మార్చుతున్నప్పుడు కనీసం 21 రోజుల తరువాతే సమావేశం జరపాలన్నారు. అవేమైనా ప్రేమలేఖలా?మునుపటి కార్యవర్గం జమాఖర్చుల లెక్కలేవీ ఇవ్వలేదని, నడిగర్‌ సంఘం ట్రస్టు జీవితకాల ట్రస్టీలుగా శరతకుమార్‌, రాధారవి అమెండ్‌మెంట్‌ చేశారని విశాల్‌, కార్తీ ఆరోపించడాన్ని కూడా రాధిక తీవ్రంగా తప్పుబట్టారు. ఆ రోజు మినిట్స్‌లో ఏముందో తనకు తెలుసునని, చట్టపరంగా చిక్కులున్నాయని గుర్తించి శరతకుమార్‌ ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అలాగే లెక్కలన్నింటినీ శరతకుమార్‌ స్వయంగా ఓ నక్షత్ర హోటల్‌లో నాజర్‌కు అప్పగించారని, ఆ దృశ్యం వీడియోటేప్‌ కూడా ఉందన్నారు. అవి లెక్కల పత్రాలు కాకపోతే, ప్రేమలేఖలా?అని రాధిక వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. శరతకుమార్‌ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న ప్రస్తుత కార్యవర్గ సభ్యులే సంఘం నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, తారల క్రికెట్‌ ద్వారా సమకూరిన నిధుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపించారు. ఇంటర్నెట్‌లో పొందుపరచిన లెక్కలు సక్రమంగా లేవని, కార్తీ బంధు సంస్థ డ్రీమ్‌ వారియర్స్‌ నుండి ట్రస్టుకి రూ.10లక్షలు అప్పు ఎందుకు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని రాధిక డిమాండ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com