సిరియా బాలుడి ఫొటో యావత్‌ ప్రపంచాన్నే కంటతడి పెట్టించింది

- September 05, 2015 , by Maagulf

సిరియా బాలుడి ఫొటో యావత్‌ ప్రపంచాన్నే కంటతడి పెట్టించింది. ఇప్పుడా తండ్రి చెబుతున్న కడుపు కోత హృదయ విదారకంగా ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం వదలి వెళ్లిపోతుండగా కడలి తమ కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న తీరును గుండె బరువు చేసుకుని వివరించాడా తండ్రి. కట్టుకున్న భార్య, పసితనం వీడని చిన్నారి బిడ్డలు ఒక్కరొక్కరుగా నీళ్లలో మునిగిపోతుంటే ఏమీ చేయలేని తన నిస్సహాయ స్థితికి వెక్కి వెక్కి ఏడ్చాడు. 'నా బిడ్డ నా చేతుల్లోంచే సముద్రంలోకి జారిపోయాడు. పడవ సముద్రంలో మునిగిపోతుంటే ఓ చేతితో నా భార్య చేతిని పట్టుకున్నా.. కానీ మరో చేతిలో నుంచి ఇద్దరు పిల్లలు సముద్రంలోకి జారిపోయారు.. ఒకరిని నా భార్యకు అప్పగించే లోపే నీటిలో మునిగిపోయారు. ఏమీ చేయలేకపోయాను.. ఎవ్వరినీ కాపాడుకోలేకపోయాను..' అని బాలుడి తండ్రి అబ్దుల్లా కన్నీరుమున్నీరయ్యారు. 'సముద్రం నుంచి బయటపడిన తర్వాత నా పిల్లల్ని, భార్యని ఎవరైనా రక్షించివుంటారని, ఎలాగైనా బయటపడి ఉంటారని ఆశపడ్డా. ఆస్పత్రికీ వెళ్లా. అక్కడికి వెళ్లి శవాల్నే చూడాల్సి వచ్చింది' అని వాపోయారు 40 ఏళ్ల అబ్దుల్లా. ఆస్పత్రిలో భార్య, ఒక కుమారుడి మృత దేహాలు చూసి కుప్పకూలిపోయాడు అబ్దుల్లా. మరో కుమారుడు ఐలన్ కుర్ధీ మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకొచ్చింది. అది చూసిన అబ్దుల్లా కుటుంబాన్ని కాపాడుకోలేని తన దుస్థితికి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సంతోషంగా, సుఖంగా బతకాలని ఏ కొబానే నుంచి అయితే బయలుదేరాడో అదే కొబానే పట్టణానికి తన వారిని ఖననం చేయడానికి వెళ్తున్నానని గుండలవిసేలా రోదిస్తున్నాడు అబ్దుల్లా. వారితోనే తనను కూడా సమాధి చేస్తే బాగుండు అని కుమిలి కన్నీరుమున్నీరవుతున్నాడు. బాల శరణార్ధి ఉదంతం హృదయ విదారకం: ఐరాస ఐక్యరాజ్య సమితి శరణార్ధుల పునరావాసానికి పిలుపునిచ్చింది. దాదాపు 2 లక్షల మంది శరణార్ధులను ఐరోపా దేశాలు తమ మధ్య పంచుకోవాలని ఐరాస శరణార్ధుల కమీషనర్ ఆంటోనియో గుటెర్రెస్ ఓ ప్రకటనలో కోరారు. బుధవారం సిరియాకు చెందిన ఓ బాల శరణార్ధి టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన వైనం ప్రపంచాన్ని కలచివేసింది. మధ్య ప్రాఛ్యం, ఆఫ్రికా నుంచి ఐరోపాకు వలసదారులు, శరాణార్ధులు వెల్లువెత్తుతుండటంతో ఐరోపా ప్రభుత్వాలు వలస సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. శుక్రవారం నాడు శరణార్ధుల సమస్యను చర్చించడానికి ఈయూ విదేశాంగ మంత్రులు సమావేశం కానున్న నేపథ్యంలో ఐరాస హై కమీషరన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.వలసల సంక్షోభాన్ని పరిష్కరించడానికి అరకొర చర్యలతో సరి పెట్టొద్దని ఐరోపాకు ఆయన హితువు పలికారు. ఒంటరిగా ఏ ఒక్క దేశం కూడా ఈ సమస్యను పరిష్కరించజాలదని, అదే సమయంలో ఏ ఒక్క దేశం ఈ బాధ్యతల నుంచి తప్పించుకోకూడదని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com