2 వేల రూపాయిల తయారీలో విఫలమైన ఐఎస్ఐ

- February 18, 2017 , by Maagulf
2 వేల రూపాయిల తయారీలో విఫలమైన ఐఎస్ఐ

అవినీతి, నల్లధనం, నకిలీ నోట్ల అంతానికి కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ మరో ఎత్తుగడకు యత్నిస్తోంది. భారత్‌లో దొంగ నోట్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది. ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన రూ.2వేల నకిలీ నోట్లను తయారు చేస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన కేంద్ర నిఘా వర్గాలు ఇంటలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇప్పటికే రూ.2వేల నోటుపై ఉండే దాదాపు 10 రకాల సెక్యూరిటీ ఫీచర్లను విజయవంతంగా కాపీ కొట్టిందని తెలిపాయి. ఐఎస్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు నకిలీ నోట్లను తయారు చేయటంలో నిమగ్మమయ్యాయని, అయితే ఆర్బీఐ వాడే పేపర్ నాణ్యతను అవి అందుకోలేకపోయాయని వెల్లడించాయి.

నోటు ముద్రణ కోసం ఆర్బీఐకి పేపర్ సరఫరా చేస్తున్న కంపెనీల నుంచి ఐఎస్ఐ ఆ పేపర్‌ను దక్కించుకోకుండా ఉండేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించాయి. గత వారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతంలో ఎన్ఐఏ, బీఎస్ఎఫ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టి నకిలీ రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకున్నాయి. పాక్‌లో తయారు చేసిన ఈ నోట్లను బంగ్లాదేశ్ గుండా దేశంలోకి తీసుకొచ్చేందుకు ఐఎస్ఐ ప్రయత్నాలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కరాచీ శివార్లలో ఐఎస్ఐ మింట్! ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్‌కు పంపించే పేపర్, సిరా కోసం ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ప్రయత్నాలు చేశాయని గతంలో ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు కూడా నకిలీ నోట్లు తయారు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. 2వేల నోట్లతో పాటు 500 నకిలీ నోట్లను కూడా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. అయితే అన్ని సెక్యూరిటీ ఫీచర్లను అందుకోవటంలో ఐఎస్ఐ విఫలమైందన్నారు. నకిలీ నోట్లు​ తయారు చేసేందుకు ఐఎస్ఐ కరాచీ శివార్లలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిందన్నారు. దీనికి దావుద్ గ్యాంగ్ పూర్తి సహకారం అందిస్తోందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com