చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా..పవన్

- February 20, 2017 , by Maagulf
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా..పవన్

ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్... వరుస ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్న జనసేన చీఫ్ ఇప్పుడు చేనేతపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. చేనేతకు  బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించిన పవన్.. మంగళగిరి వేదికగా  కార్మికుల కష్టాలపై గళం వినిపించబోతున్నారు. గతంలో రాజధాని భూములు, పోలవరం, ఉద్దానం సమస్యలపై పోరాడిన పవన్.. చేనేతపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.అమెరికా పర్యటన సక్సెస్ కావడంతో  జోష్  లో ఉన్న పవన్ కల్యాణ్.. ప్రజా సమస్యలపై మరింతగా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే అనేక సమస్యలపై గళం విప్పిన జనసేన చీఫ్..ఆర్థిక ఇబ్బందులతో చతికిలపడిన చేనేతకు చేయూత ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. మంగళగిరిలో ఇవాళ నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహానికి హాజరవుతున్నారు. పవన్ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 10 వేల మంది రావచ్చనే అంచనాతో  నిర్వాహకులు సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలో  చేనేత కులాల జనాభా 13శాతంగా ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి.తినడానికి తిండిలేక నేతన్నలు ఆకలి చావులకు పాల్పడ్డారు. వేలాది చేనేత కుటుంబాలు ఆర్థికఇబ్బందుల్లో అల్లాడిపోతున్నాయి.  తమను ఆదుకోవాలని పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా  ఫలితం దక్కలేదు. దీంతో  చేనేత కార్మిక సంఘాల నేతలు  జనసేన అధినేతను కలిసి తమ సమస్యలను వివరించాయి. తమకు అండగా ఉండాలని కోరాయి.. నేతన్నల సమస్యలపై స్పందించిన పవన్..కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. వారానికోసారి చేనేతను ధరిస్తానని, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఉంటానన్నారు పవన్. జనసేన అధ్యక్షుడు పవన్ కొంతకాలంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా, రాజధాని , పోలవరం , ఉద్దానం కిడ్నీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం కూడా పవన్ సూచనలను పరిగణలోకి తీసుకుంటోంది. పవన్ పర్యటన తర్వాత ఉద్దానం బాధితులకు కొంత ఊరట లభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర బృందాలు ఆ గ్రామాన్ని పర్యటించి సమస్యను శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నాయి. దీంతో  తనను  ఆశ్రయించిన నేతన్నల కోసం పోరాటానికి సిద్ధమయ్యాడు గబ్బర్ సింగ్. మరోవైపు పవన్ చేనేత సత్యగ్రహానికి హాజరవుతుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రులు, అధికారులతో చంద్రబాబు చర్చించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సత్యాగ్రహ సభలో పవన్ చేసే సూచనలను స్వీకరించాలని సూచించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పు పడుతున్న  పవన్..చేనేత సమస్యలపై ఎలా స్పందిస్తారు..సర్కార్ కు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్నదని ఆసక్తిగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com