హైదరాబాద్‌లో మళ్ళీ డ్రగ్స్ మాఫియా కలకలం..

- April 09, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో మళ్ళీ డ్రగ్స్ మాఫియా కలకలం..

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ మాఫియా డొంక కదలింది. పోలీసుల కన్నుగప్పి కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండిపోవడం.. అదను చూసి మత్తుమందు చేరవేయడం సిటీలో పరిపాటిగా మారిపోయింది. యూత్‌ను డ్రగ్స్‌ బానిసలుగా చేస్తున్న ఈ మాఫియాలో ఐదుగురు పోలీసుల వలకు చిక్కారు. ఇందులో ఇద్దరు షరామామూలుగా నైజీరియన్లున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 
హైదరాబాద్‌ పాతబస్తీలో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఐదుగుర్ని అరెస్టు చేసి.. 65 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కారు, బైక్‌, సెల్‌ఫోన్లు, క్యాష్‌నూ సీజ్‌ చేశారు. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ మోహన్‌కుమార్, గోల్కొండ సీఐ ఫయాజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. గోల్కొండ సెవన్ టూంబ్స్ దగ్గర్లోని దక్కన్ పార్కు వద్ద ఐదురుగు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడం పోలీసులు గమనించారు. ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తే డ్రగ్స్‌ ముఠాగా తేలింది. అరెస్టైన వారిలో ఇద్దరు నైజీరియన్లు, ఒక బెంగుళూరువాసి, ఇద్దరు హైదరాబాదీలు ఉన్నారు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి డ్రగ్స్‌ దందా చేస్తున్నారు. మాదకద్రవ్యాల సరఫరాలో నైజీరియన్లే  కీలక సూత్రధారులని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తేల్చేశారు. వీరు కొకైన్‌ డ్రగ్‌ను గోవా నుంచి బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గోవాలో గ్రాము కొకైన్‌ను 15 వందల రూపాయలకు కొని.. ఇక్కడ  4 వేలకు పైగా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సోలపై మరోసారి పీడీ యాక్టు అమలు చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. ఇద్దరు నైజీరియన్లకు స్థానిక బీటెక్ విద్యార్థి రవితేజ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ను సిటీలోకి తేచ్చే పని నైజీరియన్లదైతే.. వాటిని అమ్మిపెట్టే బాధ్యత మిగతావారు తీసుకున్నారు. అడపాదడపా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. దీంతో.. సిటీలో ఇంకెన్ని డ్రగ్స్‌ ముఠాలున్నాయో తెలుసుకునే పనిలో ఉన్నారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com