నేడు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌ భేటీ ఢిల్లీ లో

- April 23, 2017 , by Maagulf
నేడు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌ భేటీ ఢిల్లీ లో

రైతును రాజు చేసేలా  ప్రణాళికలు రచించామన్నారు కేసీఆర్. నీతి ఆయోగ్ సమావేశంలో  పలు కీలక సూచనలు చేశారు. వ్యవసాయం రంగంలో తెలంగాణలో చేపట్టిన పథకాలను  వివరించారు.ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. ఇక ప్రధాని మోడీతో ఇవాళ సమావేశం కానున్నారు కేసీఆర్. గిరిజన, బీసీ-ఈ రిజర్వేషన్ కోటా పెంపు బిల్లుపై చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో  సమావేశం కానున్నారు. ప్రధాని నివాసంలో ఉదయం 11.45 గంటలకు జరిగే భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన గిరిజన, బీసీ-ఈ రిజర్వేషన్ కోటా పెంపు బిల్లులను ఆమోదించాలని కోరనున్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ర్టానికి సంబంధించిన ఇతర అంశాలపైనా ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని పార్టీ ప్లీనరిలో ఆమోదించిన  తీర్మానాన్ని మోడీకి  అందించనున్నారు కేసీఆర్. కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలుపైనా ప్రధానితో తెలంగాణ సీఎం చర్చించనున్నారు. 
ఇక ప్రధాని మోడీ  అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పలు సూచనలు చేశారు కేసీఆర్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు తెలంగాణలో అనేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహించే చర్యలను ప్రారంభించామన్నారు. వ్యవసాయాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు.17 వేల కోట్ల రుణమాఫీ ద్వారా 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. వాతావరణానికి అనుగుణంగా దేశంలో క్రాప్‌ కాలనీలు ఏర్పాటుచేసి, ప్రత్యేక పంటలు పండించే చర్యలు చేపట్టాలని  సూచించారు. పంట దిగుబడి పెంచేందుకు వివిధ రాష్ర్టాల్లోని పరిశోధన సంస్థలను ప్రోత్సహించాలన్నారు కేసీఆర్. పంటలకు నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎరువుల కోసం ఎకరాకు 4 వేల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. రైతులకు నీరు అందించే ప్రభుత్వ పథకాలకు కేంద్రం సహకరించాలన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ బీమా పథకాలను సంస్కరించాలని సూచించారు. ఆహార ధాన్యం, నూనె గింజలు, టెక్స్‌టైల్స్ దిగుమతులను సమగ్రంగా సమీక్షించాలన్నారు తెలంగాణ సీఎం. వ్యవసాయానికి మద్దతిచ్చే డెయిరీ, గొర్రెలు, చేపల పెంపకం, పౌల్ట్రీ వంటి రంగాలను పన్నుల నుంచి మినహాయించాలని కోరారు. కాంపా నిధులు విడుదలకు అడ్డంకులను వీలైనంత త్వరగా తొలగించాలని కేంద్రానికి కేసీఆర్ సూచించారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ సారథ్యంలోని అఖిలపక్షానికి  అపాయింట్‌మెంట్ ఇచ్చిన ప్రధాని...చివరి నిమిషంలో రద్దు చేశారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఒక్కరే సమావేశం  అవుతున్నా..ఎస్సీ వర్గీకరణపై చర్చించే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com