భారతీయ శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణి ఇజ్రాయెల్‌కు డాన్ డేవిడ్ పురస్కారం

- May 18, 2017 , by Maagulf
భారతీయ శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణి ఇజ్రాయెల్‌కు డాన్ డేవిడ్ పురస్కారం

భారతీయ శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణి ఇజ్రాయెల్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక డాన్ డేవిడ్ పురస్కారాన్ని గెలుచున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆయన సేవలకుగానూ ఈ పురస్కారం వరించింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్ యూనివర్సిటీలో ఈనెల 21న జరుగనున్న కార్యక్రమంలో అవార్డుతోపాటు, రూ.68 లక్షల నగదు బహుమతి అందుకోనున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అయస్కాంత క్షేత్రాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఆయన పాలోమర్ స్పెక్ట్రమ్ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఈ సంస్థ అంతరిక్షంపై పరిశోధనలు నిర్వహిస్తుంది. అంతరిక్షంలో జరుగుతున్న విస్ఫోటనాలను గుర్తించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నది. 

డాన్ డేవిడ్ ఫౌండేషన్ పరిశోధనలను భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలుగా విభజించి విజేతలను ఎంపిక చేస్తుంది. చరిత్ర, పురావస్తుశాస్త్రం వంటి రంగాలను భూత కాలంగా, కళలు, రాజకీయాలు, ఆర్థికం, మీడియా తదితర రంగాలను వర్తమాన కాలంగా, శాస్త్ర సాంకేతిక రంగాలను భవిష్యత్‌కాలంగా పరిగణించి ఆయా రంగాల్లో పరిశోధనలతో మానవాళికి ప్రయోజనం చేకూర్చిన వారిని ఎంపిక చేసి బహుమతులు అందిస్తుంది. శ్రీనివాస్ కులకర్ణిని భవిష్యత్ క్యాటగిరీలో ఎంపిక చేసింది. ఆయన పోలండ్ కు చెందిన ఆండ్రెజ్ ఉడాల్సీ, అమెరికాకు చెందిన నెయిల్ గెహ్రెల్స్‌తో కలిసి ఈ పురస్కారాన్ని పంచుకోనున్నారు. గతంలో భారత్ నుంచి రచయిత అమితావ్ ఘోష్, సంగీత విద్వాంసుడు జుబిన్ మెహతా, శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com