ఇస్రో బృహత్తర ప్రయోగం 'జీఎస్ఎల్వీ ఎం.కె-3' రెడీ

- May 29, 2017 , by Maagulf
ఇస్రో బృహత్తర ప్రయోగం 'జీఎస్ఎల్వీ ఎం.కె-3' రెడీ

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో.. మరో బృహత్తర ప్రయోగానికి సిద్ధమైంది. కొత్త తరం రాకెట్‌ను నింగిలోకి పంపడం ద్వారా మరింత బలాన్ని సొంతం చేసుకోనుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు వేల కిలోల బరువైన ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం ఉన్న GSLV MK-3 ప్రయోగం  చేపట్టనుంది. ఇప్పటివరకు ఈ స్థాయి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో ఇతర దేశాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈసారి సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన రాకెట్‌తో ప్రయోగానికి సిద్ధమవుతోంది.

జూన్‌ 5న ఈ భారీ ప్రయోగాన్ని చేపట్టబోతోంది ఇస్రో. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్  అంతరిక్ష కేంద్రంలో ఈ నౌకను ప్రయోగవేదికకు విజయవంతంగా అనుసంధానించారు. ఇప్పటి వరకు భారత్‌ తయారు చేసిన రాకెట్లలో ఇదే అత్యంత భారీది. బరువు 640 టన్నులు. దీని ద్వారా ఇస్రో చరిత్రలోనే భారీ సమాచార ఉపగ్రహమైన 3 వేల 200 కిలోల జీశాట్‌–19ను అంతరిక్షంలోకి పంపనున్నారు.

దేశంలో కమ్యూనికేషన్ రంగానికి ఉపయోగపడే కేఏ బాండ్‌, కేయూ బాండ్‌లను ఈ ఉపగ్రహంలో అమర్చారు. అలాగే జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రా మీటర్‌ అనే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని రాకెట్‌ ద్వారా రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. అంతరిక్షంలోని రేడియేషనను పరిశీలించేందుకు దీనిని ఉపయోగించనున్నారు. మొత్తం మూడు దశల్లో జీఎస్‌ఎల్వీ-మార్క్‌3 రాకెట్‌ ప్రయోగం జరుగుతుంది. రెండు ఘన ఇంధనం మోటార్లతో తొలి దశను, ద్రవ ఇంధన ఇంజన్‌తో రెండో దశ, క్రయోజనిక్‌ ఇంజన్‌తో మూడో దశను రూపొందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com